Share News

సమస్యలపై గొంతెత్తితే...దృష్టి మళ్లించే ప్రయత్నం దుర్మార్గం: జగన్‌

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:11 AM

‘రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గం. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం’ అని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు.

సమస్యలపై గొంతెత్తితే...దృష్టి మళ్లించే ప్రయత్నం దుర్మార్గం: జగన్‌

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్‌ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గం. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనం’ అని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. శనివారం ఆయన ఎక్స్‌ వేదికగా పొదిలి ఘటనలో పోలీసులు పెట్టిన కేసులపై స్పందించారు. ‘పొగాకు రైతులకు భరోసా ఇవ్వడానికి నేను పొదిలి వెళ్తే కార్యక్రమానికి సంఘీభావంగా సుమారు 40 వేల మంది ప్రజలు, రైతులు వచ్చారు. మేం వెళ్తున్న మార్గంలో చంద్రబాబు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి, వారిని ఉసిగొల్పి, రాళ్లు విసిరి గలాటా చేయించారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించారు. అలాకాకుండా 40 వేల మంది ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారూ? పైగా ఉల్టా రైతులపై, ప్రజలపై కేసులు పెడతారా? రోమ్‌ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు... ఆ రైతుల సమస్యలను పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది’ అని జగన్‌ విమర్శించారు.

Updated Date - Jun 15 , 2025 | 05:13 AM