Share News

Sudhakar Doctor Incident: గతం గుర్తు లేదా జగన్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:44 AM

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా కూటమి సర్కారు మాత్రం చోద్యం చూస్తోందంటూ మాజీ సీఎం జగన్‌ తెగ ఆందోళన పడిపోతున్నారు. కొవిడ్‌పై చంద్రబాబు చలించడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. కొవిడ్‌ అసలు సమస్యే కాదని తన హయాంలో మాట్లాడి నవ్వులపాలైన జగన్‌..

Sudhakar Doctor Incident: గతం గుర్తు లేదా జగన్‌
YS Jagan

  • జనాన్ని భయపెట్టేలా కొవిడ్‌పై రోతరాతలు

  • బ్లీచింగ్‌ చల్లాలని..పారాసిట్మాల్‌ వేసుకోవాలని నాడు జగన్‌ సలహా

  • కొవిడ్‌ సమస్యేకాదని ప్రకటించి నవ్వులపాలు

  • మాస్క్‌లు అడిగిన డాక్టర్‌కు చిత్రహింసలు

  • రెండో దశలో తీవ్రత తక్కువే.. అయినా యాగీ

(అమరావతి, ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా కూటమి సర్కారు మాత్రం చోద్యం చూస్తోందంటూ మాజీ సీఎం జగన్‌ తెగ ఆందోళన పడిపోతున్నారు. కొవిడ్‌పై చంద్రబాబు చలించడంలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. కొవిడ్‌ అసలు సమస్యే కాదని తన హయాంలో మాట్లాడి నవ్వులపాలైన జగన్‌.. అధికారం పోగానే కొవిడ్‌పై ప్రజల్ని భయపెట్టేలా తన రోతపత్రికలో రాతలు రాయిస్తున్నారు. నిజానికి, కొవిడ్‌ రెండోదశలో కేసులు, తీవ్రత.. రెండూ తక్కువే. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది. వాస్తవం ఇది కాగా, కొవిడ్‌ సమస్యపై ‘సర్కారు చోద్యం’ చూస్తుందంటూ జగన్‌ రోతపత్రిక బురద చల్లే ప్రయత్నం చేసింది. నిజానికి, జగన్‌ సీఎంగా ఉండగానే ప్రపంచమంతా కొవిడ్‌ మహమ్మారి విజృంభించింది.

రాష్ట్రంలోనూ కేసులు పెరిగిపోయాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు? కాస్తంత ప్రభుత్వ భరోసా... మరింత ఆరోగ్య ఆసరా. కానీ దీనికి భిన్నంగా క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో నాడు జగన్‌ మాట్లాడారు. కొవిడ్‌కు భయపడాల్సిన పనిలేదు ..బ్లీచింగ్‌ చల్లితే .. పారాసిట్మాల్‌ వేసుకుంటే పోతుందంటూ ఆయన తేలిగ్గా మాట్లాడారు. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలిపోతుంటే .. కరోనా బారినపడ్డ రోగులతో ఆస్పత్రులన్నీ నిండిపోతుంటే .. నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే..జగన్‌ నిర్వాకం ఆనాడు ఇలా ఉంది. దీంతో ఆయనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. దళిత సామాజికవర్గానికి చెందిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌ మాస్క్‌ను ఇవ్వాలని కోరిన పాపానికి నడిరోడ్డుపై పెడరెక్కలు విరిచికట్టి ఆనాడు పోలీసులు కొట్టారు. డాక్టర్‌ సుధాకర్‌ను చిత్రహంసలకు గురి చేశారు.


చివరికి ఆయన మానసిక క్షోభకు గురై మృతి చెందారు. జగన్‌ హయాంలో కొవిడ్‌ నివారణకు ప్రత్యేకంగా చేపట్టిన చర్యలు కనిపించవు. ఆక్సిజన్‌, మాస్కులు అందుబాటులో లేవు. దీంతో రాష్ట్రంలో వేలాదిగా కరోనాబారిన పడి మృతిచెందారు. దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతోంది. దీనిని మొదట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియ్‌సగానే తీసుకున్నాయి. కానీ వైరస్‌ తీవ్రత పెద్దగా లేకపోవడంతో .. కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. అయినా, రాష్ట్రంలో కరోనా పరీక్షలు ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ, ప్రభుత్వాస్పత్రుల్లోనూ చేస్తున్నారు. కరోనా లక్షణాలు గుర్తిస్తున్నారు.

కొసమెరుపు: కరోనా సమయంలో రాజకీయ పార్టీలు, నేతలు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి. ఒకవైపు కరోనా తీవ్రం అయిందని అంటూనే, గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్‌ 4వ తేదీని (బుధవారం) ‘వెన్నుపోటు దినోత్సవం’గా జరపాలని మరోవైపు పిలుపునివ్వడం జగన్‌కే చెల్లింది.

Updated Date - Jun 07 , 2025 | 09:54 AM