Tobacco Farmers: జగన్.. ఏ మొహం పెట్టుకొని వచ్చావ్
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:05 AM
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులను దగా చేసి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారి వద్దకు వచ్చావని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని నిలదీశారు.

నాడు పొగాకు రైతులను దగా చేశావ్
రాజకీయాల కోసం రైతులను రెచ్చగొడతావా?
అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు పట్టవా?
మంత్రులు డోలా, గొట్టిపాటి ఫైర్
ఒంగోలు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పొగాకు రైతులను దగా చేసి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారి వద్దకు వచ్చావని రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని నిలదీశారు. ఏదోరకంగా రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేసేందుకే జగన్ పొగాకు వేలం కేంద్రానికి వచ్చాడని విమర్శించారు. బుధవారం ఒంగోలు శివారులోని ఒంగోలు-2 పొగాకు వేలం కేంద్రంలో.. రైతుల ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం జరిగింది. దీనికి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్కుమార్లతో కలిసి మంత్రులు పాల్గొన్నారు. తొలుత ఎద్దులతో అరక దున్ని ఏరువాక సాగించిన మంత్రులు, అనంతరం వేలం కేంద్రంలో కొనుగోళ్ల తీరును పరిశీలించారు. అనంతరం, పొగాకు రైతులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ సీఎం జగన్ పొదిలిలో పొగాకు వేలం పరిశీలనకు రావడంపై మండిపడ్డారు. ‘మీ ఐదేళ్ల పాలనలో ఏనాడైనా రైతుల గురించి పట్టించుకున్నారా? పొగాకు రెతులకు మేలు జరిగింది టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ప్రస్తుతం కూడా నల్లబర్లీ రెతులు ధరలు లేక, కొనుగోళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు’ అని తెలిపారు. నల్లబర్లీ పొగాకు క్వింటా రూ.12వేల వంతున ప్రభుత్వం కొనుగోలుకు నిర్ణయించిందని, ఈనెల 16 నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తున్నామని చెప్పారు. రైతులకు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఇవ్వనున్నటు తెలిపారు. ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేసేందుకే జగన్ పొగాకు వేలం కేంద్రానికి వచ్చాడని మండిపడ్డారు. అమరావతి మహిళల గురించి జర్నలిస్టులు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించకుండా, ఇక్కడ రైతుల కోసం అంటూ జగన్ ఎలా వస్తాడని ప్రశ్నించారు. సమావేశంలో పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, డీసీసీబీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.