Anil Chauhan: సముద్రంపై తిరుగులేని శక్తిగా భారత్
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:08 AM
నిన్న మొన్నటి వరకు ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు వాటిని తయారుచేసే స్థాయికి ఎదిగిందని, సముద్రంపై తిరుగులేని శక్తిగా మారిందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు.

స్వదేశీ పరిజ్ఞానంతో 98 నౌకలు తయారీ
‘అర్నాల’ ప్రారంభోత్సవంలో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): నిన్న మొన్నటి వరకు ఇతర దేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసిన భారత్ ఇప్పుడు వాటిని తయారుచేసే స్థాయికి ఎదిగిందని, సముద్రంపై తిరుగులేని శక్తిగా మారిందని డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. కోల్కతా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్-షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ ‘అర్నాల’ను విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో బుధవారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఇప్పటివరకూ స్వదేశీ పరిజ్ఞానంతో 98 యుద్ధ నౌకలు తయారు చేసిందని, అందులో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, న్యూక్లియర్ సబ్మెరైన్లు, ఫ్రిగేట్లు, కార్వెట్లు, డెస్ట్రాయర్లు, సర్వే నౌకలు ఉన్నాయని చెప్పారు.
ఇవి కాకుండా మరో 60 నౌకలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, మరో 180 నౌకల నిర్మాణానికి ఒప్పందాలు తయారవుతున్నాయన్నారు. కొత్తగా నౌకాదళంలో చేరిన ‘అర్నాల’కు పెద్ద సవాళ్లను స్వీకరించగల సత్తా ఉందని, భారత తీర ప్రాంత రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంధార్కర్, వార్షిప్ ప్రొడక్షన్ అండ్ ఎక్విజిషన్ కంట్రోలర్ వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ అండ్ ఇంజనీర్స్ సీఎండీ కమొడోర్ పి.హరి తదితరులు పాల్గొన్నారు.