Home Minister Anita: జగన్, భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:02 AM
రాష్ట్ర ప్రజలతోపాటు అమరావతి వాసులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..

మహిళలను కించపరిచిన వారిపై చర్యలు తప్పవు: హోంమంత్రి అనిత
విశాఖపట్నం, జూన్ 8 (ఆంధ్రజోతి): రాష్ట్ర ప్రజలతోపాటు అమరావతి వాసులకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, భారతిరెడ్డి క్షమాపణలు చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి చానెల్లో జర్నలిస్టు కృష్ణంరాజు.. ‘అమరావతి వేశ్యల రాజధాని’ అని సంబోంధించడం తనతోపాటు మహిళలందరినీ తీవ్ర మనోవ్యథకు గురిచేసిందన్నారు. ఆయన వ్యాఖ్యలను చానెల్ యజమాని వైఎస్ భారతిరెడ్డిగానీ, ఆమె భర్త జగన్గానీ ఖండించలేదన్నారు. దీన్నిబట్టి వారి ప్రోద్బలంతోనే కృష్ణంరాజు అలా మాట్లాడివుంటారనే అనుమానం కలుగుతోందని చెప్పారు. కృష్ణంరాజు తన వ్యాఖ్యలను సమర్దించుకునేందుకు అమరావతి చుట్టుపక్కల సెక్స్ వర్కర్ల పునరావాసానికి పనిచేసే ఎన్జీవోలు 120కిపైగా ఉన్నాయని చెప్పారని, తాను ఆరోగ్య శాఖ అధికారులను ఆరా తీయగా రాష్ట్రం మొత్తంమీద 109 ఎన్జీవోలు మాత్రమే ఉన్నాయని తెలిసిందన్నారు. అమరావతిపై జగన్కు మొదటి నుంచీ అక్కసు ఉందని, అందుకే అవకాశం దొరికినప్పుడల్లా బురదజల్లడం, ఇతరులను ప్రేరేపించడం చేస్తుంటారని ఆరోపించారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా గతంలో అమరావతిని శ్మశానంతో పోల్చారన్నారు. అమరావతి వాసులతోపాటు రాష్ట్ర ప్రజల మనస్సులు గాయపడేలా మాట్లాడిన వారిపై, సంబంధిత టీవీ చానెల్పై తమ శాఖకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.