Amaravati: అమరావతిలో మళ్లీ ఆందోళనలు..
ABN , Publish Date - Jun 14 , 2025 | 06:35 PM
రాజధాని అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆ ప్రాంత రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో వారు ఆందోళన బాట పట్టారు.

అమరావతి, జూన్ 14: రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. అందుకోసం శనివారం రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆ క్రమంలో తుళ్లూరులో సాక్షి చానెల్ యాజమాని వైఎస్ జగన్, వైఎస్ భారతీలకు వ్యతిరేకంగా వారు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వీరిద్దరు వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సాక్షి చానెల్ను వెంటనే మూసివేయాలంటూ ఈ సందర్భంగా వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు మందడం గ్రామంలోని రైతులు, మహిళలు రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణం రాజు, సజ్జల రామకృష్ణారెడ్డి క్షమాపణలు చెప్పే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్గా తీసుకుని బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
ఒక కేసులో బెయిల్పై ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు. న్యాయస్థానం ఆయన బెయిల్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కూటమి సర్కార్కు ఆందోళనకారులు సూచించారు. లేకుంటే వీరు మరింత రెచ్చిపోతారని.. శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తారని పేర్కొన్నారు. ఇంకోవైపు ఈ రోజు శనివారం కావడంతో.. సచివాలయం, హైకోర్టులకు సెలవు కావడంతో ఈ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ తక్కువగా ఉండడంలో పోలీసులు కాస్తా ఊపిరి పీల్చుకున్నారు.
గత వారం సాక్షి టీవీలో చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు పాల్గొని.. రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చ కార్యక్రమానికి కొమ్మినేని శ్రీనివాసరావు యాంకర్గా వ్యవహరించారు. ఆయన సైతం కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయలేదు. అయితే కృష్ణంరాజు వ్యాఖ్యలపై రాజధాని అమరావతి ప్రాంత మహిళలు, రైతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో వారు ఆందోళన చేపట్టి.. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఆందోళనలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సజ్జల వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు, మహిళలు మండిపడ్డారు.
మరోవైపు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక జర్నలిస్ట్ కృష్ణంరాజును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
లోకేశ్ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము లేదా?: హోమంత్రి అనిత..
మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్
For AndhraPradesh News And Telugu News