ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళిక: సత్యకుమార్
ABN , Publish Date - May 16 , 2025 | 04:36 AM
ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆరోగ్య సేవల్లో విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు.

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశాఖలో వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానున్నందున ఆరోగ్యశాఖలోని తొమ్మిది విభాగాల పనితీరు, సాధించిన ఫలితాలపై మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గత 11 నెలలుగా నమోదైన వైద్యులు, సహాయక సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల తీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పలు అంశాలను సమీక్షించారు. గత ప్రభుత్వం చెప్పుకున్న దానికి భిన్నంగా ఖాళీలు భారీగా ఉన్నాయన్నారు. సత్వర నియామకాల కోసం ఈ ప్రక్రియను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి ఆరోగ్యశాఖ నియామక బోర్డుకు మార్చడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో నెలకొన్న అవినీతికిఅడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అందరికీ రూ.25లక్షల ఆరోగ్యబీమా కల్పించేందుకు మిశ్రమ పద్ధతిని త్వరలో అమల్లోకి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.