Ambatai Vs Police: నీ అంతు చూస్తానంటూ.. పోలీసులపై అంబటి దౌర్జన్యం
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:06 PM
Ambatai Vs Police: మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. గుంటూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గుంటూరు, జూన్ 4: మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ‘నీ అంతు చూస్తాను’ అంటూ పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకు పోలీసు అధికారి అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో ఈరోజు (బుధవారం) వైసీపీ వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో వెన్నుపోటు దినం కార్యక్రమానికి బయలుదేరిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రెచ్చిపోయి ప్రవర్తించారు. అంబటి రాంబాబు, పోలీసు అధికారి నరహరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఇరువురి ఘర్షణ చూసిన జనం షాక్ అయ్యారు.
నేటితో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి అయిన సందర్భంగా వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి తన ఇంటి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరారు అంబటి. మార్గ మధ్యలోనే మాజీ మంత్రిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా వెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై అంబటి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు.
దమ్ముంటే ర్యాలీని ఆపండి మీ అంతు చూస్తామంటూ అక్కడే ఉన్న పోలీసుపై దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన కేకలు వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసు అధికారి, మాజీ మంత్రి ఇద్దరూ నడిరోడ్డుపై పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఘర్షణకు దిగారు. పోలీసులపై అంబటి రాంబాబు విరుచుకుపడ్డ తీరును చూస్తే ఇటు పోలీసు శాఖలోనూ, గుంటూరు నగర వాసుల్లో ఒకరకమైన ఆశ్చర్యం నెలకొంది. ప్రతిపక్షంలో ఉన్న నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసి పరుషపదజాలంతో దూషిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ వ్యవహారంలో అంబటి రాంబాబుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కాగా.. ఈ మధ్యకాలంలో వైసీపీ నేతల చేష్టలు శృతిమించిపోతున్నాయి. ఏకంగా పోలీసులపై తమ రుబాబును చూపిస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు పోలీస్స్టేషన్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని వజ్రపుకొత్తూరులోని గరుడభద్రలో వైసీపీకి చెందిన పలువురు ఆక్రమణలకు యత్నించగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన మాజీ మంత్రి పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐను దుర్భాషలాడారు. అయితే సీఐ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అంతే ధీటుగా సమాధానం ఇచ్చారు. పోలీస్స్టేషన్కు వచ్చి ఇబ్బందిపెడితే ఊరుకునేది లేదంటూ సీఐ వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీసుల పట్ల వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు
వెన్నుపోటుకు, కత్తిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. గంటా ఫైర్
Read Latest AP News And Telugu News