Guntur: మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలు
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:27 AM
గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడి ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా...

పురుగుమందు అవశేషాలున్నాయని ఎగుమతులు వెనక్కి
60 కంటైనర్లను తిరస్కరించిన చైనా కస్టమ్స్ శాఖ
రిటర్న్ వస్తే 80 శాతం దిగుమతి సుంకం బాదుడు
లబోదిబోమంటున్న మిర్చి ఎగుమతిదారులు
గుంటూరు, జూన్ 8(ఆంధ్రజ్యోతి): గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడి ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా, వాటిలో పురుగుమందుల అవశేషాలున్నాయని క్విండాగో కస్టమ్స్ టెక్నికల్ సెంటర్ తిరస్కరించింది. వాటిని వెంటనే భారత్కు వెనక్కి తీసుకెళ్లిపోవాలని, లేకుంటే తామే తగలబెట్టేస్తామని హెచ్చరించింది. దీంతో గుంటూరు నుంచి కొంతమంది ఎక్స్పోర్టర్లు చైనాలో ఉన్న ఇండియన్ ఎంబసీ, స్పైస్ బోర్డు అధికారులను తీసుకెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. అయినప్పటికీ వారు ససేమిరా అనడంతో కంటైనర్లలో ఉన్న 900 టన్నుల మిర్చిని వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే, వాటిని వెనక్కి తీసుకొస్తే ఇక్కడి పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్నారని 80 శాతం దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంది. దీంతో ఎగుమతిదారులు లబోదిబోమంటూ విజయవాడలో ఉన్న కస్టమ్స్ కమిషనర్కు మొర పెట్టుకొన్నారు.
గతంలో ఎన్నడూ లేదు!
ఏటా గుంటూరు మిర్చియార్డు నుంచి ఎక్స్పోర్టర్లు చైనాకు 2 లక్షల టన్నులకు పైగా మిర్చిని ఎగుమతి చేస్తుంటారు. ఈ సంవత్సరం అక్కడి దిగుమతిదారులు పెద్దమొత్తంలో ఆర్డర్లు పెట్టారు. మిర్చి ధర చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. క్వింటా రూ.9 వేల నుంచి రూ.13 వేలకు వెరైటీ బట్టి లభ్యమయ్యాయి. ఏ దశలోనూ మార్కెట్లో ధర పెరగలేదు. దీంతో ఈ సంవత్సరం దాదాపుగా 3 లక్షల టన్నుల ఆర్డర్లు వచ్చాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతోందనుకొంటున్న తరుణంలో మిర్చిలో పురుగుమందుల అవశేషాలున్నాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ ఒక్కసారిగా బాంబు పేల్చింది. మరియా సల్ఫర్ పాస్పరస్ 0.30 ఎంజీ/కేజీ, పైరిమిడిన్ 0.53/కేజీ, బెంజోడజె్పనెస్ 0.20 ఎంజీ/కేజీ ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టులో వచ్చిందని చైనా కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. కొన్ని కంటైనర్లలోని మిర్చిలో థైమిన్ 0.52 ఎంజీ/కేజీ ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చైనాలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధులను కలిసి గోడు వెలిబుచ్చారు. అలానే స్పైసెస్ బోర్డు అధికారులకు నివేదించడంతో ఈ రెండు సంస్థలు అధికారులను పంపించి చర్చలు జరిపిస్తున్నాయి.
ఇంపోర్టు డ్యూటీ మినహాయించాలని లేఖ!
సాధారణంగా కంటైనర్లు చైనాకు చేరుకోగానే అక్కడి దిగుమతిదారులు వాటిని వేర్హౌ్సలకు తరలిస్తారు. చైనా కస్టమ్స్ అధికారులు ఆయా వేర్హౌ్సలకు వెళ్లి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపుతారు. 2-3 రోజుల్లో ఫలితాలు వస్తాయి. ఇదే విధానం పోర్టులోనే నిర్వహించి కంటైనర్లను తిరస్కరిస్తే వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి ఇబ్బంది ఉండదు. అయితే వేర్హౌ్సలో దిగుమతి జరిగాక టెస్టులు చేసి తిరస్కరిస్తుండటంతో వాటిని తాజా కంటైనర్లలోనే లోడింగ్ చేసి వెనక్కి తీసుకురావాలి. ఈ క్రమంలో మిర్చి మొత్తం పాడైపోతుంది. ఇలా ఫ్రెష్ కంటైనర్లలో సరుకును తీసుకురావడం వల్ల ఆ దేశం నుంచి భారత్కు మిర్చిని వ్యాపారులు దిగుమతి చేసుకొంటున్నారని కస్టమ్స్ శాఖ దిగుమతి సుంకం విధిస్తుంది. అసలే సరుకు తిరస్కరణకు గురై తీవ్రంగా నష్టపోయిన వ్యాపారి రవాణా చార్జీలు, దిగుమతి సుంకం చెల్లించాలంటే పూర్తిగా దివాలా తీయాల్సిందే. ఈ నేపథ్యంలో చైనా నుంచి తిరస్కరణకు గురైన సరుకును ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇక్కడి పోర్టుల్లో దిగుమతి చేసుకొనేలా అనుమతించాలని కస్టమ్స్ కమిషనర్కు ఎక్స్పోర్టర్లు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. దీనిపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.