Macharla Court: గుండ్లపాడు జంట హత్యల కేసులో..
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:43 AM
పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

ఆరుగురు నిందితుల అరెస్టు
19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మాచర్ల కోర్టు
నరసరావుపేట లీగల్/మాచర్ల టౌన్, జూన్ 5(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన గుండ్లపాడు టీడీపీ నేతల జంట హత్యల కేసులో ఆరుగురు నిందితులను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారిని మాచర్ల కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నరసరావుపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గుండ్లపాడులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, తోట వెంకట్రామయ్య మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జవిశెట్టి వెంకటేశ్వర్లుకు గ్రామంలో మంచి గుర్తింపు ఉంది. ఆయన పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో తమ రాజకీయ భవిష్యత్కు అడ్డంకిగా మారుతారని రెండోవర్గంవారు భావించారు. ఈ క్రమంలో గుండ్లపాడుకు చెందిన తోట వెంకటరామయ్య(ఏ-1), జవిశెట్టి శ్రీనివాసరావు, తోట గురవయ్య, శ్రీను బొచ్చిలి, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రం, రచ్చమల్లపాడుకు చెందిన దొంగరి నాగరాజులు.. పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో కలిసి హత్యకు పథకం రూపొందించారు. గత నెల 25న నిందితులు స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి ఆపై రాళ్లు వేసి హత్య చేశారు.
వీరిలో ఆరుగురు నిందితులు బుధవారం వెల్దుర్తి తహశీల్దార్ కార్యాలయంలో లొంగిపోగా, పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మాచర్ల మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా.. న్యాయాధికారి శ్రీనివాస్ కల్యాణ్ ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నిందితులను గుంటూరు జైలుకు తరలించారు. పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాల్సి ఉంది.
పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్పై విచారణ 12కి వాయిదా
టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి వేసిన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.