Tenali : క్వాంటమ్ ఏఐ పేరిట ఘరానా దోపిడీ
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:46 AM
గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వంటివారు చెబితే ఎవరు నమ్మకుండా ఉంటారు?

21 వేల పెట్టుబడితో 22లక్షలు ఆర్జనంటూ వల
నమ్మి పెట్టుబడులు పెట్టిన వారికి నయ వంచన
తెనాలి సహా పలు ప్రాంతాల్లో సైబర్ బాధితులు
పట్టించుకోని పోలీసులు.. ఫిర్యాదు రాలేదని వెల్లడి
(తెనాలి-ఆంధ్రజ్యోతి)
రూ. 21వేలు పెట్టుబడి పెడితే కేవలం నెలరోజుల్లో రూ. 20 లక్షలు ఆదాయం రావటం ఎక్కడైనా చూశారా! పైగా మీ పెట్టుబడులకు 100 శాతం గ్యారెంటీ. 100 శాతం వృద్ధి. సంపాదించిన దానిపై 0% టాక్స్ అంటే ఎగిరి గంతేయకుండా ఉంటారా! ఇదంతా చెప్పేది ఏదో గుర్తింపులేని కంపెనీ అయితే పెద్దగా పట్టించుకోరు. గూగుల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల సీఈఓలు, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ మాజీ గవర్నర్ వంటివారు చెబితే ఎవరు నమ్మకుండా ఉంటారు? పైగా చిన్న మొత్తమే కదా అన్నట్టు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆన్లైన్లో పెట్టుబడి పెట్టేస్తున్నారు. అయితే.. పెట్టుబడి పెట్టాక నెలలు గడచినా తమ ఖాతాలో ఎలాంటి అదనపు డబ్బు జమ కాకపోవటంతో ఆ తర్వాత జరిగిన మోసం గ్రహించి పెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. దీనికి కారణం ‘ఏఐ’ సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ ముఠా చేస్తున్న నయా మోసం. ఎక్కడా చిన్న అనుమానం కూడా రాకుండా వారు చేస్తున్న మోసానికి చదువుకున్నవారు, సాప్ట్వేర్ పరిజ్ఞానం ఉన్నవారే బాధితులుగా మారుతున్నారు. తాజాగా తెనాలిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.21 వేలు జమచేసి తర్వాత మోసపోయామని గ్రహించారు. ఇదే తరహాలో ఏఐ టెక్నాలజీ మోసానికి గురైవారు మిగిలిన ప్రాంతాల్లో చాలా మందే ఉన్నారని తెలుస్తోంది. కృత్రిమ మేథ(ఏఐ)ను అడ్డు పెట్టుకుని తేలికగా డబ్బు దోచేసేందుకు ఏకంగా ఫేక్ వీడియోలను సృష్టిస్తూ ముఠా సభ్యులు రెచ్చిపోతున్నారు. ప్రముుఖులు మాట్లాడినట్టు ఏఐతో ఫేక్ వీడియోలను సృష్టించి వదులుతున్నారు. ఆయా ప్రముఖులను ప్రధాన జాతీయ న్యూస్ చానల్స్ ఇంటర్వ్యూలు చేసినట్టు, వారే స్వయంగా ఇవన్నీ చెప్పినట్టు న్యూస్ రీడర్లు కూడా వార్తల రూపంలో వీటిని చదవటం ఘరానా మోసాల ప్రయత్నానికి పరాకాష్ట. ఇవి కూడా చాలవన్నట్టు కొందరు వ్యక్తులు తామెంతో లాభపడ్డామని అభిప్రాయాలు చెప్పడం గమనార్హం.
క్వాంటమ్ ఏఐతో వల
రానున్న రోజుల్లో ‘ఏఐ’ గొప్ప విప్లవాన్ని సృష్టిస్తుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెడితే కాసులు పంట పండుతుందని ‘క్వాంటమ్ ఏఐ’ పేరుతో ఒక ప్రాజెక్ట్ను తీసుకొచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో గత నెల నుంచి ఊదర గొడుతున్నారు. అయితే, ఈ ప్రాజెక్టును ఎవరికివారు తాము తీసుకొచ్చామంటే తాము తీసుకొచ్చామని ప్రముఖులు పోటా పోటీగా చెప్పటం విశేషం. ఈ క్వాంటమ్ ఏఐ ప్రాజెక్టు పేరుతో గూగుల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటివి పోటీపడటం చూస్తే కచ్చితంగా ఇది మోసమనే అర్ధమవుతుంది. దీనికితోడు రూ.21 వేలు చెల్లిస్తే 30 రోజుల్లో రూ.6 లక్షలు వస్తాయని ఒక వీడియోలో, రూ.15 లక్షలు వస్తాయని మరో వీడియో, రూ.19.5 లక్షలు వస్తాయని మరో వీడియోలో, రూ.40 లక్షలు వెనకేస్తారంటూ మరో వీడియోలో పొంతన లేకుండా చెప్పటం గమనార్హం. ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి ఈ పెట్టుబడుల విషయంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక సెన్సేషన్ అని పేర్కొనటం సైబర్ ముఠా పన్నాగంలో భాగం.
ఇంత దుమారం రేపుతున్నా!
ఏఐ టెక్నాలజీతో ఆర్థిక మోసాలకు తెరదీసి, నిబంధనలకు విరుద్ధంగా అధికారిక ప్రకటన తరహాలో బరితెగించినా సైబర్ నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు వాటిపై దృష్టి పెట్టిన దాఖలా కనిపించటంలేదు. అంబానీ వీడియో గత ఆరు నెలల నుంచి వస్తుంటే, మిగిలిన ప్రముఖుల వీడియోలు నెల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ వంటి మాద్యమాల్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వీటిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అలాంటి ఫిర్యాదు వస్తే విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. కానీ, మోసపోయినవారు మాత్రం బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారు. కాగా.. నకిలీ వీడియోలు వైరల్ చేసేందుకే సోషల్ మీడియాలో ఖాతాలు తెరుస్తున్నారని బాధితులు చెబుతున్నారు. నిన్నటి వరకు డిజిటల్ అరెస్ట్ అంటూ రెచ్చిపోయిన సైబర్ మాఫియా ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో నయా మోసాలకు తెరదీసింది. ఆదిలోనే పోలీసులు అప్రమత్తం అయితే సైబర్ ముఠాను కట్టడి చేసే అవకాశం ఉంది.