Share News

Youth Drowned in Godavari: గోదావరి లంకలో ఘోరం

ABN , Publish Date - May 27 , 2025 | 04:22 AM

గోదావరి నదిలో 8 మంది 21 ఏళ్ల లోపువారైన యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు మరియు కోనసీమ జిల్లాకు చెందినవారు.

 Youth Drowned in Godavari: గోదావరి లంకలో ఘోరం

  • 8 మంది యువకులు గల్లంతు

  • ఇద్దరిని రక్షించే ప్రయత్నంలో ముగ్గురు.. ఆపై మరో ముగ్గురు

  • గల్లంతైన వారిలో ఇద్దరు అన్నదమ్ములు

  • అంతా కాకినాడ, కోనసీమ జిల్లా వాసులే.. 21 ఏళ్లలోపువారే

  • ఓణీల వేడుకకు వచ్చి ప్రమాదంలోకి..

కాకినాడ, మే 26(ఆంధ్రజ్యోతి): గోదావరిలో ఘోరం జరిగింది. ఓ వేడుకకు వచ్చి.. ఆ తర్వాత సరదాగా స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు నదిలో గల్లంతయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైనవారంతా 21 ఏళ్లలోపు వాళ్లే కావడంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైనవారి ఆచూకీ కోసం కోనసీమ ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎస్డీఆర్‌ఎఫ్‌, గజ ఈతగాళ్లతో గాలింపు ముమ్మరం చేశారు. వివరాలివీ.. కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం శేరులంకలో సోమవారం కొండేపూడి నాగరాజు ఇంట ఓణీ వేడుక జరిగింది. ఈ శుభకార్యానికి కాకినాడ, ఐ.పోలవరం, శేరులంకకు చెందిన యువకులు వచ్చారు. వేడుకలో సరదాగా గడిపారు. మధ్యాహ్నం 3 గంటలకు అరకిలోమీటరు దూరంలో ఉన్న ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద ఉన్న గౌతమీగోదావరి నది వద్దకు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. మొదట్లో లోతు తక్కువగా ఉండడంతో లోపలకు వెళ్లారు. తీరా లోతు అధికంగా ఉండడంతో ప్రవాహ ఉధృతికి ఇద్దరు కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు ప్రయత్నించి వారు కూడా కొట్టుకుపోయారు. వారిని కాపాడేందుకు మరో ముగ్గురు ప్రయత్నించి, వారు సైతం ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. ఇలా 8 మంది గల్లంతయ్యారు. వారితోపాటే నదిలో దిగిన మరో ముగ్గ్గురు మాత్రం ఒడ్డుకు చేరారు. గల్లంతైన వారిలో కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమ్మానియేలు(19), సబిత పాల్‌(18), తాతిపూడి నితీష్‌(18), ఎలుమర్తి సాయి(18), మండపేటకు చెందిన కులపాక రోహిత్‌(18), కె.గంగవరం మండలం శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్‌(14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములైన వడ్డే మహేష్‌(16), వడ్డే రాజేష్‌(14) గల్లంతయ్యారు.


క్రాంతి, పాల్‌ డిగ్రీ చదువుతుండగా, వీరిద్దరూ కాకినాడలోని జగన్నాథపురం చర్చి పాస్టర్‌ తనయులుగా గుర్తించారు. ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యానాం వరకు గోదావరిలో గాలించారు. మంత్రి సుభాష్‌ ఆదేశాలతో కలెక్టర్‌ స్పందించి ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పిలిపించారు. జనరేటర్ల సాయంతో అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగించారు.

గాలింపు ఆలస్యంపై స్థానికుల ఆగ్రహం

యువకుల కోసం పోలీసులు అన్వేషించే ప్రయత్నం చేయగా, అమలాపురం ఆర్డీవో మాధవి వచ్చారు. స్థానికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి నాలుగు గంటలైనా అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వెలుతురు ఉండగా గాలింపు చర్యలు ఉధృతం చేయకుండా చీకటి పడ్డ తర్వాత ఏం ఉపయోగమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ మహేష్‌ ఘటన స్థలానికి రాత్రి ఏడున్నర గంటలకు చేరుకోగా, కలెక్టర్‌ వద్ద స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎం, డిప్యూటీ సీఎం దిగ్ర్భాంతి..

యువకుల గల్లంతు ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పవన్‌.. కలెక్టర్‌ మహేష్ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.

పోటుతో ఎంత ప్రమాదమో..

కమినిలంక గోదావరి పాయవద్ద స్నానం చేయడం ప్రమాదకరమని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ గోదావరి పాయకు సమీపంలో ఆరు కిలోమీటర్లు ఉన్న యానాం నుంచి నీరు వెనక్కు ఎదగన్నుకుని వస్తుంది. యానాం వద్ద గోదావరి, సముద్రం నీళ్ల పోటుపాటు కారణంగా వెనక్కు ఎగదన్ని కమినిలంక వద్ద గోదావరికి తరచూ పోటుపాటులు కొనసాగుతాయి.

Updated Date - May 27 , 2025 | 04:23 AM