Forest Officer Corruption: ఫారెస్టు అధికారిని వెంటాడిన అవినీతి కేసు
ABN , Publish Date - May 20 , 2025 | 04:57 AM
2006లో అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఫారెస్టు అధికారి కాసకాని సత్యనారాయణకు 2025లో శిక్ష పడింది.రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించగా, ఆయనకు పింఛను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2006లో నమోదు.. 2025లో శిక్ష.. ప్రభుత్వ పింఛను నిలుపుదల
రాజమహేంద్రవరం, మే 19(ఆంధ్రజ్యోతి): అక్రమ సంపాదనతో ఆస్తులు కూడబెట్టుకున్న ఓ అధికారిని నేరం వెంటాడింది. 19 ఏళ్లు గడిచినా.. 70 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్నా.. శిక్ష అనుభవించక తప్పలేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఫారెస్టు డిపార్టుమెంట్లో జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సెల్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్స్ట్సగా కాసకాని సత్యనారాయణ విధులు నిర్వర్తించేవారు. ఉద్యోగంలో ఉండగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ 2006 మార్చి 13న కేసు నమోదు చేసి రూ.22,17,563 విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. తర్వాత 2012 మే 31న సత్యనారాయణ ఉద్యోగ విరమణ పొందారు. కేసు విచారణ అనంతరం రాజమహేంద్రవరం ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ ఏడాది మార్చి 26న తీర్పు ఇచ్చింది. నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించడంతో సత్యనారాయణకు పింఛను, గ్రాట్యుటీని శాశ్వతంగా నిలుపుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.