Fake Ghee: కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వ్యయం రూ.కోటి
ABN , Publish Date - Jun 25 , 2025 | 03:35 AM
టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ఏర్పాటైన సిట్కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.47 లక్షలు మంజూరు చేసింది

సిట్కు గతంలో రూ.51 లక్షల కేటాయింపు.. తాజాగా మరో రూ.47 లక్షలు మంజూరు
తిరుపతి, జూన్ 24(ఆంధ్రజ్యోతి): టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ఏర్పాటైన సిట్కు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఇదివరకే సిట్ నిర్వహణకు రూ.51 లక్షలు కేటాయించగా తాజా కేటాయింపుతో ఈ కేసు దర్యాప్తు కోసం దాదాపు రూ.కోటి ఖర్చు చేసినట్టయింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి టీటీడీ వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీబీఐ, రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన సిట్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 11న రూ.51 లక్షలు మంజూరు చేసింది. సిట్ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. పెరిగిన కాలానికి, మునుపటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు నిధులు మంజూరు చేయాలని డీజీపీ ఈ నెల 5న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ మేరకు రూ.47 లక్షలు మంజూరు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.