AP Politics: పెద్దారెడ్డి వర్సెస్.. ప్రభాకర్ రెడ్డి.. వణికిపోతున్న తాడిపత్రి..
ABN , Publish Date - May 13 , 2025 | 12:24 PM
ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

తాడిపత్రి, మే 13: ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పంతం పట్టారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత హింస చెలరేగి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈక్రమంలో పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే రెండు వర్గాలు మరోసారి తలపడతాయేమోననే ఆందోళన పట్టణ ప్రజల్లో నెలకొంది. ఈ వారంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టు అనుమతితో తాడిపత్రికి వస్తున్నారని సమాచారం. ఉరవకొండలో సీఎం ప్రోగ్రాం, వీరజవాన్ మరణంతో పోలీసులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండటంతో భద్రతా కారణాల రీత్య ఆయన రాక కొంత ఆలస్యమైనట్లు సమాచారం. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అడ్డుకుంటామని ఇప్పటికే జేసీ ప్రభాకర్రెడ్డి సంకేతాలు పంపించిన విషయం అందరికి తెలిసిందే.
వాటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికే దాదాపు 200 మంది పోలీసులను తాడిపత్రిలో దింపింది. ఈక్రమంలో చోటా మోటా నాయకుల్లో అలజడి ఏర్పడింది. పెద్దారెడ్డి రాకతో ఏమైనా గొడవలు జరిగితే ఎక్కడ తాము ఇరుక్కోవాల్సి వస్తుందోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కుటుంబాలకు దూరమవడమే కాకుండా ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయం వారిలో నెలకొంది. ఇప్పటికీ ప్రభోదానంద కేసులు, ఎలక్షన్ కేసులతో ఇబ్బంది పడుతుంటే మళ్లీ ఎక్కడ కొత్త కేసులు వచ్చి నెత్తిన పడతాయోననే ఆందోళన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులు కూడా ఇప్పటికే పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలువురు నాయకులు, కార్యకర్తలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
కేసుల భయం..
ఇప్పటికే పోలీసు అధికారులు నాయకులకు హెచ్చరికతో కూడిన సూచనలు చేనట్లు సమాచారం. పదిరోజుల కిందట తాడిపత్రి కళాశాల గ్రౌండ్లో రాళ్లు తోలారని ఆరోప ణలు రావడంతో ఉన్నతాధికారులు వాటిని దృష్టిలో పెట్టుకొని నాయకులు, రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. అల్లర్లు సృష్టించి ఘర్షణల్లో పాల్గొన్నట్లయితే కేసులు నమోదుచేసి రౌడీషీట్ ఓపెన్ చేసి జిల్లా నుంచి బహిష్కరిస్తామని, అవసరమైతే పీడీయాక్ట్ వంటి కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిసింది. ఈక్రమంలోనే నాయకుల్లో కేసుల గుబులు రేగుతోంది. గతంలో ప్రభోదానంద కేసులు, 2024 ఎన్నికల కేసులు ఇరుక్కొని కొంతకాలం అండర్ గ్రౌండ్కు వెళ్లిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని కొందరు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
హైకోర్టు అనుమతి.. పోలీసుల్లో టెన్షన్..
ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరమయ్యాడు. పట్టణానికి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆయన తాడిపత్రికి వెళ్లడానికి అనుమతిస్తూ, భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వారంలో ఆయన తాడిపత్రిలో అడుగుపెట్టనున్నారని సమాచారం. ఈ క్రమంలో తాడిపత్రిలో శాంతిభద్రతలకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఆడిషనల్ ఎస్పీ రోహితకుమార్ చౌదరి నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం.
జేసీపీఆర్ పట్టుతో..
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లోనూ తాడిపత్రికి రానిచ్చే ప్రసక్తే లేదని, అడ్డుకొని తీరతామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పలుమార్లు చెప్పారు. ఇప్పటికీ అదే పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు అనుమతి ఉన్నా ఇప్పటికే రెండుమూడు సార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈ సారి తప్పనిసరిగా తాడిపత్రికి వెళ్లాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అయితే మరో రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మరికొంత కాలం వేచి ఉండాలని మాజీ ఎమ్మెల్యేకు పోలీసులు సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈనేపథ్యంలో ఇద్దరు నాయకులకు సర్ది చెప్పాలంటే స్థానిక పోలీసు అధికారులకు తీవ్ర భారం అవుతోంది. ఈ విషయాన్ని పై అధికారులు లేక జిల్లా అధికారులు చెబితేనే వినే పరిస్థితి ఉందని కొందరు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. ఎవరికి చెప్పినా ఎక్కడ సమస్య దారితీస్తోందోనని ఉన్నతాధికారుల్లో భయం నెలకొంది. ఇప్పటికే గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లతో ఎస్పీ, డీఎస్సీ, సీఐ, హెడ్కానిస్టేబుళ్లు, అధికారులు సస్పెండ్ కావడం, వీఆర్కు వెళ్లడం వంటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
Also Read:
అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు..
రాక్షసులు దొరికేశారు.. ఒకడు హతం.. మరో ఇద్దరు..
అణువణువూ జల్లెడ పడుతున్న ఆర్మీ
For More Andhra Pradesh News and Telugu News..