Anantababu Driver Case: విచారణ వేగవంతం.. ఇక నిజాలు బయటకు రావాల్సిందే
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:52 PM
Anantababu Driver Case: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీశ్ దేవరాజ్ పాటిల్ను నియమించారు.

కాకినాడ, ఏప్రిల్ 22: ఏపీలో పెను సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ హత్యకు సంబంధించి నిందితుడు వైసీపీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు విచారణను పూర్తిగా నీరుగార్చిన పరిస్థితి. అదే విధంగా ఛార్జ్షీట్ దాఖలులో అనేక లోపాలు కనిపించాయి. దీంతో ఈ కేసులో పురోగతి కనిపించకుండా పోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎట్టకేలకు కేసులో కదలిక వచ్చింది. ఈ కేసుకు సంబంధించి న్యాయం చేయాలంటూ బాధితులు కోరగా.. అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కూడా హామీ ఇచ్చింది.
అందులో భాగంగా పునర్విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఈ కేసు పునర్విచారణకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశించారు. విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి మనీశ్ దేవరాజ్ పాటిల్ను నియమించారు. ఈ కేసుకు సంబంధించి 60 రోజుల్లో డీజీపీ, ఎస్పీకి నివేదిక ఇవ్వాలని దేవరాజ్ పాటిల్ను ఆదేశించారు. నివేదికతో కోర్టులో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Borugadda Anil: అనంత కోర్టు వద్ద బోరుగడ్డ సంచలన కామెంట్స్
మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సహకరించేందుకు రాజమండ్రికి చెందిన ముప్పాళ్ల సుబ్బారావును అనే న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా రాజమండ్రి అట్రాసిటీ కోర్టు ఈ కేసును తిరిగి విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో ప్రాసిక్యూషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన పత్రాలను కూడా ప్రభుత్వ న్యాయవాదులు సిద్ధం చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో ఈ హత్య కేసును పూర్తిగా నీరుగార్చేసిందని.. మరి కొందరు నిందితులను కేసులో చేర్చాల్సి ఉందని కోర్టును ప్రాసిక్యూషన్ కోరనున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా కేసును లోతుగా విచారించాలని ఇందుకు ఆదేశాలు ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోరే అవకాశం ఉంది.
అయితే తన వద్ద పనిచేసిన డ్రైవర్ను తానే చంపానని అనంతబాబు ఒప్పుకున్నట్లు అప్పటి ఎస్పీ కూడా ప్రకటించారు. అయినా కూడా ఇప్పటి వరకు కూడా చార్జ్షీట్లో గానీ, నిందితుడిని గుర్తించడంతో కూడా పోలీసులు ముందుకు వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ కేసును సాంకేతి ఆధారాలతో సహా మళ్లీ మొదటి నుంచి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది
JD Vance Jaipur Tour: అంబర్ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం
Read Latest AP News And Telugu News