Share News

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక

ABN , Publish Date - May 17 , 2025 | 07:39 AM

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో తుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Crime News: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక
Crime News..

కాకినాడ జిల్లా: తుని నియోజకవర్గ (Tuni constituency) పరిధిలోని తొండంగి మండల ఆంధ్రజ్యోతి (Andhrajyothy) విలేకరి (Journalist) కాతా సత్యనారాయణ (katha Satyanarayana) హత్య కేసు (Murder Case)లో కదలిక వచ్చింది. అయిదేళ్ల క్రితం (2019) జరిగిన ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్‌కు సహకరించడానికి కాకినాడకు చెందిన సీనియర్‌ న్యాయవాది మోహన మురళిని ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిగా నియమించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేసులో కదలిక వచ్చింది. ఈ కేసులో తుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను గతేడాది నవంబర్‌ 5న హైకోర్టు కొట్టేసింది.


కత్తులతో నరికి హత్య

జర్నలిస్టు సత్యనారాయణ విధులు ముగించుకుని (15-10-2019న) ద్విచక్ర వాహనంపై తన నివాసానికి వెళుతుండగా మాటువేసి.. కొందరు వ్యక్తులు బైక్‌ను అడ్డుకుని కత్తులతో నరికి చంపారు. విలేకరి హత్యకు దాడిశెట్టి రాజా కారణమంటూ మృతుని కుటుంబీకులు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తుని గ్రామీణ పోలీసు స్టేషన్‌లో 302 రెడ్‌విత్‌ 34 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్‌ (288/2019) నమోదుచేశారు. దాడిశెట్టి ప్రోద్బలంతో జి. రాజబాబు, మురాలశెట్టి నాగవెంకటరమణ, మాకినీడి బుజ్జి, పెద్దిరెడ్ల సురేష్, గాబు గణేష్‌ హత్య చేశారని మృతుని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా 2023లో ఛార్జిషీటులో దాడిశెట్టి పేరు తప్పించారు. ఆయన వైసీపీలో మంత్రి హోదాలో ఉండడంతో కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి.

Also Read: విజయ్‌ షాపై చర్యలు తీసుకోండి


అయిదున్నరేళ్లుగా పోరాటం

జర్నలిస్టు సత్యనారాయణ సోదరుడు గోపాలకృష్ణ న్యాయం కోసం అయిదున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారు. దాడిశెట్టిపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేశారు. ప్రభుత్వాన్నీ ఆశ్రయించారు. అయినా కేసు ముందుకు సాగలేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సత్యనారాయణ సోదరుడు కాతా గోపాలకృష్ణ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో పదవి కూడా నిర్వహించారు. ఆ క్రమంలోనే గత రెండు ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన వైసీపీ నేత దాడిశెట్టి రామలింగేశ్వర రావుతో సత్యనారాయణకు విబేధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ కేసులో కదలిక రావడంతో దాడిశెట్టి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లయింది. ఈ కేసులో రాజా ఏ6గా ఉన్నారు. కాగా జర్నలిస్టు సత్యనారాయణ హత్యపై నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా జర్నలిస్ట్ సంఘాలు ఆందోళనలు చేశాయి. హత్యని నిరసిస్తూ, పాత్రికేయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆదివారం నింగిలోకి రీశాట్‌-1బీ

సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 07:39 AM