సందేశమిస్తూ.. సామాజిక అంశాలను స్పృశిస్తూ
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:13 AM
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు లక్షల్లో సంపాదిస్తూ పిల్లలు కనకపోవడం, దానికి డింక్ (డబుల్ ఇన్కమ్ నో కిడ్స్) అని పేరు పెట్టడం ఏ సంస్కృతి. ఇందుకోసం మాతృత్వాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో పలు సామాజిక అంశాలను స్పృ శిస్తూ ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో భోగాపురం నాటక కళాపరిషత్

భోగాపురంలో ఆకట్టుకుంటున్న జాతీయస్థాయి నాటిక పోటీలు
పిఠాపురం/పిఠాపురం రూరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): భార్యాభర్తలు లక్షల్లో సంపాదిస్తూ పిల్లలు కనకపోవడం, దానికి డింక్ (డబుల్ ఇన్కమ్ నో కిడ్స్) అని పేరు పెట్టడం ఏ సంస్కృతి. ఇందుకోసం మాతృత్వాన్ని పణంగా పెట్టడం తగదు అంటూ సందేశాన్ని ఇస్తూ, అదే సమయంలో పలు సామాజిక అంశాలను స్పృ శిస్తూ ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో భోగాపురం నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయస్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండోరోజు 3 నాటికలను ప్రదర్శించారు. నేటి యువతరం ప్రయాణిస్తున్న పెడధోరణులను వివరిస్తూ వారిని సరైన మార్గంలో పెట్టాలని హైదరాబాదు మిత్ర క్రియేషన్స్ కళాకారులు ప్రదర్శించిన ఇది రహదారి కాదు నాటిక చాటిచెప్పింది. మన దేశంలో కావాల్సినంత స్వేచ్ఛ ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలి తప్ప వక్రమార్గం పట్టించవద్దని, పిల్లలను కనబోమని చెబుతూ దానికి వింత పేర్లు పెట్టుకోవడం తగదని హితవు పలికారు. పంది కూడా తన పిల్లలను సంరక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని, అటువంటి పవిత్రమైన మానవ జన్మ పొందిన మనం పిల్లలు లేకుండా చేసుకుంటారా అని ప్రశ్నించారు. దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ గ్రాండ్మాస్టర్ను అందించిన తల్లి జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెబుతూ దారి తప్పిన ఒక యువజంటను చక్కదిద్దిన విషయాన్ని ఈ నాటికలో ప్రదర్శించారు. ఆకురాత్రి భాస్కరచంద్ర ఈ నాటికను రచించగా, ఎస్ఎం భాషా దర్శకత్వం వహించారు.
జీవితం ఒక రంగస్థలం
జీవితం ఒక రంగస్థలమని, ఇందులో అంద రు నటీనటులేనని, ఎవరి పాత్ర వారి పోషించి అదృశ్యమవుతారని, ఆ పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసే వారే మహానటులని విజయవాడ అభ్యు దయ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ఆంగీకం భువనం యస్య నాటిక ద్వారా తెలియజేశారు. ఆర్థిక అంశాలతో ముడిపడిపోతున్న జీవితాల్లో ప్రేమానురాగాలకు స్థానం ఉండదని, తాను బాధపడుతూ, ప్రాణాపాయస్థితికి చేరిన తన వద్ద డబ్బును భర్తకు అందించడం, వైద్యులు వారిస్తున్నా నాటక ప్రదర్శనలో పాల్గొని స్వర్ణకమలం సాధించి అదే వేదికపై ఒరిగిపోయిన ఒక కళాకారిణి ఇతివృత్తాన్ని ప్రదర్శించారు. అనంత హృదయరాజు ఈ నాటికను రచించగా, వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు.
కంటికి కనిపించేది అంతా సత్యం కాదు, కనిపించనది అసత్యం కాదని విశాఖ ఉక్కునగరానికి చెందిన చైతన్య కళాస్రవంతి కళాకారులు తాము ప్రదర్శించిన అసత్యం నాటిక ద్వారా వివరించారు. యధార్థమైనా సరే చెడుకు దోహదపడితే అది అసత్యం, అబద్ధమైనా అది మంచికి ఉపయోగపడితే అది సత్యమని చాటిచెబుతా రు. మోదుగు శ్రీసుధ రచించిన కథను పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరణ చేయగా, పి.బాలాజీనాయక్ దర్శకత్వం వహించారు.
వారాహి పురస్కారం అందజేత
ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు సీహె చ్.మహేష్కు వారాహి విశిష్ట రంగస్థల ప్రతిభా పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. భోగాపురం నాటక కళాపరిషత్ అధ్య క్షు డు అడపా సూరిబాబు,కళాకారులు పాల్గొన్నారు.