Godavari River incident: గోదావరిలో 8 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
ABN , Publish Date - May 27 , 2025 | 07:09 AM
Godavari River incident: కోనసీమలో విషాదం.. సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు, సహాయక బృందాలు నది వద్దకు చేరుకుని గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక మృతదేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కోనసీమ జిల్లా: ముమ్మిడివరం వద్ద గోదావరిలో (Godavari River) స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయిన (8 Youth Missing) వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం సమీపంలో ఒక మృతదేహం లభ్యమైంది. అది వడ్డే మహేష్గా గుర్తించారు. ఇంకా ఏడుగురి యువకుల ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తెల్లవారు వరకు ఫ్లడ్ లైట్లు (Floodlight).. గజ ఈత గాళ్ళు.. వలల సాయంతో అధికారులు గోదావరిని జల్లెడ పట్టారు. గల్లంతయిన ఎనిమిది మందిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన సొంత సోదరులు. దీంతో యువకుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
శుభకార్యానికి వచ్చి..
కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి నాగరాజు-చిన్నారి దంపతుల కుమార్తె ప్రేమజ్యోతి రజస్వల వేడుకకు ఆమె సోదరుడు పోలిశెట్టి అభిషేక్ ఆహ్వానంపై వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు, బంధువులు హాజరయ్యారు. అందరూ సరదాగా వేడుకలో పాల్గొని విందు భోజనాలు ఆరగించిన తరువాత సరదాగా గౌతమి గోదావరిలో స్నానం చేసేందుకు 11 మంది మిత్రులు వెళ్లారు. బట్టలు, చెప్పులు, షూలు, సెల్ఫోన్లను ఒడ్డున పెట్టి స్నానానికి ఉపక్రమించారు. తొలుత ఒక యువకుడు స్నానానికి దిగాడు. ఒడ్డున స్నానం చేయడం వీలు పడకపోవడంతో కొంచెం ముందుకు వెళ్లేసరికి లోతుగా ఉండడంతో మునిగిపోయా డు. అది గ్రహించిన మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు గోదావరిలోకి వెళ్లారు. వారు కూడా మునిగిపోతుండడంతో మరో ఇద్దరు ఇలా ఒకరి తరువాత ఒకరు నదిలోకి వెళ్లి గల్లంతయ్యారు. ఆపదను గ్రహించిన కాకినాడకు చెందిన దాసరి కరుణకుమార్ (17), మేడిశెట్టి చరణ్రోహిత్ (20), కనికెళ్ల సురేష్ (19) సురక్షితంగా బయటపడ్డారు. సాన్నానికి వెళ్లిన 11 మందిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కరుణకుమార్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన వారి ఆచూకీ కోసం ఇంజను పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని గౌతమి నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read: పసుపు పండుగ...
గల్లంతైన వారి వివరాలు...
కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన సబిత క్రాంతి ఇమ్మానియేలు(19), సబిత పాల్ (18), తాతిపూడి నితీష్ (18), ఎలుమర్తి సాయి (18), మండపేటకు చెందిన రోహిత్ (18), శేరిలంక ప్రాంతానికి చెందిన ఎలిపే మహేష్ (14), ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన అన్నదమ్ములైన వడ్డే మహేష్ (16), వడ్డే రాజేష్ (14) గల్లంతయ్యారు. ఒకరి మృత దేహం లభ్యం కాగా మిగిలినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ గూఢచారిగా మారిన సీఆర్పీఎఫ్ జవాన్
For More AP News and Telugu News