RGV: పోలీస్ స్టేషన్కు ఆర్జీవీ.. ప్రశ్నలు చూసి షాక్..
ABN , Publish Date - Feb 07 , 2025 | 12:17 PM
ఒంగోలు రూరల్ పీఎస్లో డెరెక్టర్ రామ్గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో ఆయనను అధికారులు విచారించనున్నారు.

RGV: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో టీడీపీ మండల కార్యదర్శి రామలింగం వర్మపై ఒంగోలు జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గత ఏడాది నవంబర్ 10న వర్మ పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి పలుమార్లు నోటీసులు పంపారు.
అయితే, తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ను తిరస్కరించింది. ఇటీవల ఫిబ్రవరి 4న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, ఈనెల 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. విచారణకు రావాలని అధికారులు పలుమార్లు నోటీసు ఇచ్చినా పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చిన ఆర్జీవీ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.