Dhanunjay Reddy Gold Smuggling: దుబాయ్ నుంచి బంగారాన్ని తరలించిన ధనుంజయ్రెడ్డి తాలూకు మహిళ
ABN , Publish Date - May 20 , 2025 | 04:46 AM
ధనుంజయ్ రెడ్డి సంబంధిత మహిళ దుబాయ్ నుంచి బంగారం తరలించిన విషయాన్ని కూడా సిట్ దర్యాప్తు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మద్యం స్కాం వెనుక అసలైన సూత్రధారిని బయటకు తేయాలని టీడీపీ ఒత్తిడి తెస్తోంది.

ఆ బంగారానికీ, మద్యం స్కాంకు ఉన్న లింకునూ సిట్ దర్యాప్తు చేయాలి: వర్ల రామయ్య
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ‘మద్యం స్కాంలో ఇప్పటి వరకు పాత్రధారులే బయటకు వచ్చారు. అసలు సూత్రధారి ఎవరో తేల్చే దిశగా సిట్ విచారణ చేస్తోంది’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వర్ల విలేకరులతో మాట్లాడారు. ‘సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతోంది. అందుకే తమ రోత పత్రికలో పుంఖాను పుంఖాలుగా అబద్ధాలు రాస్తూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారు. దుబాయ్లో సిట్ కూర్చుంటే ఇక్కడ వైసీపీ నేతలు అందరూ స్టాండింగ్ పొజిషన్లో నిలబడుతున్నారు. సిట్ దుబాయికి వెళ్లి విచారణ మొదలుపెడితే మాకు రాజకీయాలు వద్దని దోపిడీదారులు పారిపోతున్నారు. అవినీతికి పాల్పడిన వ్యక్తి ఏ స్థాయి వారైనా చట్టం క్షమించదు. శిక్ష తప్పదు. మద్యం కుంభకోణంతోపాటు వైసీపీ హయాంలో ధనుంజయ్రెడ్డికి సంబంధించిన ఓ మహిళ దుబాయ్ నుంచి తరలించిన బంగారంపైనా సిట్ దర్యాప్తు చేయాలి. ఆ బంగారానికి, మద్యం స్కాంకు ఉన్న లింకును తేల్చాలి. ఐఏఎస్, ఐపీఎ్సలను ఎలా అరెస్టు చేస్తారని ప్రభుత్వాన్ని అంబటి ప్రశ్నిస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను అయితే చట్టానికి అతీతులా..?’ అని వర్ల ప్రశ్నించారు.