New Covid Cases: రాష్ట్రంలో మరో 4 కొవిడ్ కేసులు
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:49 AM
రాష్ట్రంలో మరో 4 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో వయసుతో పాటు చిన్నారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

రాష్ట్రంలో మరో నాలుగు కొవిడ్ కేసులు
కర్నూలు హాస్పిటల్/తిరుపతి(వైద్యం), జూన్ 3(ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రెండు రోజుల వ్యవధిలో మూడు కరోనా కేసులు నమోదవడం కలకలం రేపింది. సోమవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, మంగళవారం స్థానిక జీజీహెచ్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో జీజీహెచ్కు చెందిన ప్రొఫెసర్, మంత్రాలయం మండలం పరమాన్దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ ఉన్నారు. వైద్యుడు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతుండగా.. మహిళకు జీజీహెచ్లోని కొవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
10 నెలల చిన్నారికి కొవిడ్: తిరుపతి రుయాస్పత్రిలో పది నెలల చిన్నారికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ తెలిపారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేటకు చెందిన చిన్నారికి జ్వరం రాగా.. తల్లిదండ్రులు సోమవారం రుయాస్పత్రిలోని చిన్నపిల్లల వార్డుకు తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పరీక్షించి, స్విమ్స్లో ఆర్టీపీసీఆర్ కొవిడ్ పరీక్ష చేయించగా.. పాజిటివ్గా తేలిందని ఆయన తెలిపారు. చిన్నారి శాంపిల్స్ను పూణెకు పంపి తీవ్రతను గుర్తిస్తామని చెప్పారు.