Kadapa: కాంగ్రెస్ రెబల్స్ సభ రసాభాస
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:35 AM
కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడి ఐఎంఏ హాలులో సుంకర పద్మశ్రీ, ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహమ్మద్...

కడపలో వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా సుంకర పద్మశ్రీ సమావేశం
అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు.. తీవ్ర వాగ్వాదం
కడప కలెక్టరేట్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): కడపలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. సోమవారం ఇక్కడి ఐఎంఏ హాలులో సుంకర పద్మశ్రీ, ఇద్దరు మాజీ డీసీసీ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, నజీర్ అహమ్మద్ (ప్రస్తుతం ఇతను వైసీపీ), ఎస్ఏ సత్తార్, మరికొందరు రెబల్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. దీనిని డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జిలు ఇర్ఫాన్బాషా, అశోక్ రెడ్డి, ధ్రువకుమార్ రెడ్డి, శివమోహన్ రెడ్డి, మైనుద్దీన్, మరి కొందరు నేతలు అడ్డుకున్నారు. వైఎస్ షర్మిలారెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పద్మశ్రీ వర్గం మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పెరిగి రెండు వర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. ఒక దశలో చొక్కాలు పట్టుకొని కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. రెండు రోజుల పర్యటన కోసం ఆదివారం కడపకు వచ్చిన సుంకర పద్మశ్రీ.. సోమవారం కాంగ్రెస్ రెబల్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించారని, పీసీసీ పగ్గాలు చేపట్టాక జగన్ను టార్గెట్ చేయడమే తప్ప పార్టీ పూర్వ వైభవానికి పాటుపడడం లేదని ఆరోపించారు. షర్మిల పనితీరును రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు. కాగా.. షర్మిలకు వ్యతిరేకంగా సుంకర పద్మశ్రీ మాట్లాడిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆ సమావేశాన్ని అడ్డుకున్నారు. పథకం ప్రకారం ప్యాకేజీ తీసుకుని కడపలో షర్మిలను టార్గెట్ చేశారన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.