Gudivada Kodali Nani: కొడాలి నానికి షరతులతో బెయిల్
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:44 AM
వస్త్ర దుకాణంపై దాడి కేసులో గుడివాడ కోర్టు మాజీ మంత్రి కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.

ఏడాది తరువాత గుడివాడకు మాజీ మంత్రి
వస్త్ర దుకాణంపై దాడి కేసులో కోర్టుకు హాజరు
గుడివాడ, జూన్ 27(ఆంధ్రజ్యోతి): వస్త్ర దుకాణంపై దాడి కేసులో గుడివాడ కోర్టు మాజీ మంత్రి కొడాలి నానికి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. వారంలో రెండు రోజుల పాటు మంగళవారం, శనివారం గుడివాడ వన్టౌన్ పోలీసు స్టేషన్లో సంతకాలు చేయాలని స్పష్టం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ అధికారంలో ఉండగా 2022 డిసెంబరు 26న మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుకు చెందిన వస్త్ర దుకాణంపై కొడాలి నాని తన అనుచరులతో దాడి చేయించారు.
ఈ సమయంలో రావి వెంకటేశ్వరరావుపై కూడా పెట్రో సంచులు, కర్రలు, రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఉదంతంపై తాజాగా డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు తిరిగి విచారణ చేపట్టారు. నిందితులుగా ఉన్న 16మంది కొడాలి నాని గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి రిమాండ్ విధించింది. కొడాలి నాని చెబితేనే తాము దాడి చేసినట్టు పోలీసు కస్టడీలో పలువురు నిందితులు అంగీకరించారు. దీంతో కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కింద కోర్టుకే వెళ్లాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏడాది తర్వాత శుక్రవారం గుడివాడకు వచ్చారు.