Share News

Heatwave Alerts: కోస్తా భగభగ

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:40 AM

ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Heatwave Alerts: కోస్తా భగభగ

  • నరసాపురంలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత

  • ఉక్కపోత, వడగాడ్పులతో జనం విలవిల

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగింది. వడగాడ్పులు వీచాయి. దీంతో జనం అల్లాడిపోయారు. నరసాపురంలో 41.5, బాపట్లలో 40.4, జంగమహేశ్వరపురంలో 40, మచిలీపట్నంలో 39.6, గన్నవరంలో 39.4, నెల్లూరులో 39.3, కావలిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతకు ఉత్తరకోస్తాలో పలుచోట్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో శుక్రవారం భిన్నమైన, అసౌకర్య వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌, నంద్యాల జిల్లాల్లో 39-40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, ఉక్కపోత పరిస్థితులుంటాయని పేర్కొంది. అల్లూరి జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jun 06 , 2025 | 03:43 AM