Nara Lokesh:మిర్చి రైతుకు న్యాయం చేసింది కూటమి ప్రభుత్వమే
ABN , Publish Date - Feb 25 , 2025 | 04:34 AM
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

గత పాలకులు కేసుల మాఫీ కోసం రాజీ పడ్డారు
మేం రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాం: లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గత పాలకులు కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే... చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పరితపిస్తోంది’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిర్చి రైతుకు న్యాయం చేసేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం ఆర్థిక భారాన్ని భరించేలా నిర్ణయం తీసుకున్నాయి. మిర్చి రైతులకు క్వింటాకు కనీస మద్దతు ధర రూ.11,781 చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. 2024-25లో రైతులు పండించిన 2.58 లక్షల టన్నుల మిర్చిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడం హర్షణీయం. సీఎం వినతిపై పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు’ అని లోకేశ్ పేర్కొన్నారు.