Share News

CM Chandrababu: పంటకాలం ముందుకు

ABN , Publish Date - Jun 07 , 2025 | 02:58 AM

కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పంటలు తుఫాన్ల బారిన పడకుండా పంటకాలాన్ని ముందుకు జరపాలన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష జరిపారు.

CM Chandrababu: పంటకాలం ముందుకు

  • తుఫాన్ల ముప్పు తప్పించాలి: సీఎం

  • కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీళ్లివ్వండి

  • వెలిగొండ ఫేజ్‌-1 వచ్చే జూన్‌కల్లా పూర్తికావాలి

  • జల వనరుల శాఖపై సమీక్షలో చంద్రబాబు

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): కృష్ణా-గోదావరి డెల్టాకు తక్షణం నీళ్లివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పంటలు తుఫాన్ల బారిన పడకుండా పంటకాలాన్ని ముందుకు జరపాలన్నారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష జరిపారు. కృష్ణా, గోదావరి డెల్టాల పరిధిలో వెంటనే సాగు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చేలోగా పంటలు చేతికి వచ్చేలా పంటకాలాన్ని నిర్దేశించుకోవాలని స్పష్టంచేశారు. భూగర్భ జలాల పెంపు, రిజర్వాయర్లు నింపడం, సమర్థ నీటి యాజమాన్య విధానం అమలు.. ఈ మూడు అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో సంవత్సరమంతా భూమి పచ్చగా ఉండేలా మూడు పంటలు నిరంతరం పండించేలా చూడాలని చెప్పారు. ఒక్క ఏడాది సమృద్ధిగా వానలు కురిస్తే.. ఆ నీటితో మూడు, నాలుగేళ్లు కరువొచ్చినా తట్టుకునేలా నీటి యాజమాన్య విధానాలు చేపట్టాలని సూచించారు. పంటల విధానంలో మార్పుచేయాలని.. తడి, ఆరు తడి పంటల సాగుకు కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. జల సంరక్షణ కోసం వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్లు నిర్మించాలని సూచించారు. నిర్వహణ లోపాలు సరిచేసుకుంటూ రాష్ట్రంలో నీటి వనరులను సద్వియోగం చేసుకోవాలని.. ఇందుకోసం సమర్థంగా, శాస్త్రీయంగా నీటి ఆడిట్‌ నిర్వహించాలన్నారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి రూ.81,900 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశామని అధికారులు తెలిపారు. ఈ వ్యయంలో 50 శాతం అంటే.. రూ.40,950 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణంగా సేకరించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. అలాగే కేంద్రం వాటాగా 20 శాతం (రూ.16,380 కోట్లు) గ్రాంట్‌ రూపంలో, రాష్ట్రప్రభుత్వ ఈక్విటీ కింద పది శాతం (రూ.8,190 కోట్లు), ప్రైవేటు సంస్థల ద్వారా రూ.16,380 కోట్లు సమీకరించాలని నిశ్చయించారు.


పోలవరం నిర్మాణ పనులు ఇప్పటిదాకా 81.70 శాతం మేర పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులే జరిగాయని.. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 11 నెలల కాలంలోనే 5.93 శాతం పనులు జరిగాయని చెప్పారు. డయాఫ్రం వాల్‌ 64 శాతం, బట్రెస్‌ డ్యామ్‌ 91 శాతం, ఇసుకను గట్టిపరచే వైబ్రో కంప్రాక్షన్‌ పనులు 54 శాతం పూర్తయ్యాయని వివరించారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, సీఎంవో కార్యదర్శి రాజమౌళి, పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే..


భూగర్భ జలాల వివరాలతో బులిటెన్లు..

నీటి లభ్యతను బట్టి సమర్థ వినియోగం జరగాలి. భూగర్భ జలాలు 20 మీటర్ల కంటే తక్కువగా ఉన్న మండలాలు, 8-29 మీటర్ల మధ్య ఉన్న మండలాల వివరాలను బులిటెన్ల రూపంలో ప్రతిరోజూ అందించాలి. ఈ వివరాలు జిల్లాలు, సెంట్రల్‌, లోకల్‌ వారీగా ఉండాలి. భూగర్భ జలాల వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగించే ఫిజియో మీటర్లను, ఏడబ్ల్యుఎస్‌ సెన్సార్లు రాష్ట్రంలో కొన్ని చోట్ల వినియోగించకపోవడమేంటి? తక్షణం నూతన పరికరాలు కొనుగోలు చేసి అవసమైన చోట్ల బిగించాలి. ఇందుకు రూ.30 కోట్లు కేటాయిస్తున్నాం.

బనకచర్ల పథకానికి టెండర్లు..: పోలవరం-బనకచర్ల అనుసంధానానికి సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను అనుకున్న సమయానికి సిద్ధం చేయాలి. డీపీఆర్‌ను కేంద్రంతో ఆమోదింపజేయడంపై దృష్టి సారించాలి. భూసేకరణకు సిద్ధంగా ఉండాలి. టెండర్లు పిలిచేందుకు రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో ముసాయిదా విధాన పత్రం రూపొందింపజేయాలి. సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో టెండర్లు పిలవాలి. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తికావాలి. జల హారతి కార్పొరేషన్‌ కింద బనకచర్ల నిర్మాణం చేపడతాం. హైబ్రిడ్‌ యాన్యుటీ విధానం(హామ్‌)లో ప్రాజెక్టు చేపట్టాలి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలి. అనుకున్న సమయానికి లక్ష్యాలు సాధించేలా కాంట్రాక్టర్లను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి.


ఎండలు తాత్కాలికమే!

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు: ఐఎండీ

ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు మందగించినా.. క్రమంగా పుంజుకుని భారీ వర్షాలు కురుస్తాయని.. 105 శాతం మేర వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాలు.. వరదలతో రిజర్వాయర్లు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయన్న ఐఎండీ అంచానాలతో భవిష్యత్‌ కార్యాచరణకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రిజర్వాయర్లలోకి నీటిని తరలించడం, చెరువులను నింపడం వంటి పనులను చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం జల వనరుల శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలో వర్షపాతం, వరదలు, రిజర్వాయర్లలోకి చేరనున్న వరద వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్షలో వాతావరణ శాఖ ఇచ్చిన నివేదికలపై చర్చించారు. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి వచ్చిన వరదలో 516.91 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారంపై ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 200టీఎంసీల నీరు అధికంగా లభిస్తుందని వాతారణ శాఖ చెప్పడంతో జలవనరుల శాఖ అందుకు తగిన కార్యాచరణకు సిద్ధమైంది. ఈ ఏడాది 105శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ విశ్లేషించింది. మహారాష్ట్ర,దక్షిణాది రాష్ట్రాల్లో రుతుపవనాలప్రభావం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల మూడో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలతో నదుల్లో డిసెంబరు నాటికి భారీగా నీటి నిల్వలు ఉంటాయని అంచనా వేసింది. సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీటిని తరలిస్తూనే చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టాలను పెంచాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.


ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు..

రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలి. హంద్రీ-నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో వేగం పెంచాలి. వెలిగొండ ఫేజ్‌-1 పనులు 2026 జూన్‌కల్లా పూర్తికావాలి. శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్‌ మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలి. బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పూడిక, ముళ్ల కంపలు తొలగించాలి. సీలేరు నీరు కృష్ణా డెల్టాకు తరలించి.. సాగుకు వినియోగించడంపై దృష్టి సారించాలి.

Updated Date - Jun 07 , 2025 | 02:59 AM