Share News

Tirumala: తిరుమలలో ‘ఆపరేషన్‌ గరుడ’

ABN , Publish Date - May 11 , 2025 | 01:07 AM

పాకిస్థాన్‌ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్‌ బలగాలు శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి.

Tirumala: తిరుమలలో ‘ఆపరేషన్‌ గరుడ’
తిరుమల, విమానాశ్రయంలో..

తిరుమల, మే10(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ సరిహద్దులో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్‌ బలగాలు శనివారం మాక్‌డ్రిల్‌ నిర్వహించాయి. సామాన్యులు బస చేసే యాత్రికుల వసతి సముదాయం-3(పీఏసీ)లో ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో గంటన్నర పాటు ఈ ప్రక్రియ చేపట్టాయి. భక్తులు భయాందోళనకు గురికాకుండా ముందస్తుగానే దీనిపై ప్రచారం చేశారు. భక్తులను, సిబ్బందిని బంధీలను ఎలా రక్షించాలి,, ఉగ్రవాదులను ఎలా అంతమొందించాలనే అంశాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. నలుగురు ఉగ్రవాదులు తరహాలో ఆయుధాలతో వసతి సముదాయం-3లోకి ప్రవేశించారు. వెంటనే వీఎస్వో తమ ఉన్నతాధికారులతో పాటు ఆక్టోపస్‌ బేస్‌క్యాం్‌పకు సమాచారమిచ్చారు. వారు ఆయుధాలతో చేరుకున్నారు. మూడు హాళ్లలో నక్కి ఉన్న ఉగ్రవాదులను అంతం చేయడంతో పాటు వారి బంధీలుగా ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్టుగా మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ఇందులో అక్టోపస్‌ తో పాటు విజిలెన్స్‌, సివిల్‌ పోలీసు, ఏఆర్‌, ఏపీఎస్పీ, ఫైర్‌, బాంబ్‌, డాగ్‌స్వ్కాడ్‌ బృందాలు పాల్గొన్నాయని డీఎస్పీ విజయ్‌శేఖర్‌ మీడియాకు వివరించారు.

విమానాశ్రయంలో ...

రేణిగుంట, మే 10 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులు విమానాశ్రయంపై దాడిచేస్తే ప్రాణనష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం అడిషనల్‌ ఎస్పీ రవిమనోహరాచారి, ఎయిర్‌పోర్ట్‌ భద్రతా దళాల కమాండెంట్‌ బహుదూర్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడం, గాయాల పాలైన వారిని ఆస్పత్రికి తరలించడం, ఉగ్రవాదులను చుట్టుముట్టడం, మట్టుపెట్టడం వంటి విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో ఎయిర్‌పోర్ట్‌ ఇన్‌చార్జి పీడీ భూమినాథన్‌, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మంజునాథరెడ్డి పాల్గొన్నారు.


షార్‌లో..

సూళ్లూరుపేట, మే 10 (ఆంధ్రజ్యోతి): సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా శనివారం షార్‌లోని గేటు 1బి సమీపంలో సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. షార్‌ కేంద్రాన్ని భద్రత వలయంలోకి తీసుకొన్నారు. సీఐఎ్‌సఎఫ్‌ డీఐజీ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసు, మెరైన్‌ అధికారులతో భద్రతపై చర్చించారు. కార్యక్రమంలో సీఐఎ్‌సఎఫ్‌ సీనియర్‌ కమాండెంట్‌ సంజిత్‌ కుమార్‌, డిప్యూటీ కమాండెంట్‌ ఎన్‌కే గౌర్‌, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, శ్రీహరికోట ఎస్‌ఐ శ్రీకాంత్‌, మెరైన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 01:07 AM