Share News

Mothers Day: అమ్మ కల ఇది!

ABN , Publish Date - May 11 , 2025 | 01:51 AM

అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్‌సలు అయ్యారు. వెంకటేశ్వర్‌.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు.

Mothers Day: అమ్మ కల ఇది!
తిరుపతి నగర కమిషనర్‌ మౌర్య - కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి, ఆంధ్రజ్యోతి: అమ్మకి మరోపేరే త్యాగం. ఓర్పు, నేర్పు.. అమ్మదనంతో అలవోకగా అలవడే లక్షణాలు. బిడ్డల కోసం జీవితంతో పోరాడే ధీశాలి. భూదేవితో తప్ప అమ్మను మరిక దేనితోనూ పోల్చలేం. అందుకే.. ‘తానుండలేని తావులో తనకు బదులుగా దేవుడు అమ్మని సృష్టించాడు’ అని చెబుతారు. కని, పెంచిన కష్టం మాత్రమే కాదు.. బిడ్డల బంగారు భవిష్యత్తుకూ అమ్మ రూపశిల్పి. అమ్మ పట్టుదలకూ, ప్రేమకూ, అమ్మకన్న కలలకూ ప్రతిరూపాలే పిల్లలు. అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్‌సలు అయ్యారు. వెంకటేశ్వర్‌.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు. వీరిద్దరు అమ్మల గురించి ఆంధ్రజ్యోతితో పంచుకున్న సంగతులు.. వారి మాటల్లోనే..

అమ్మ కల : కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

నేను చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉండేవాడిని. అది గమనించిన అమ్మ.. నువ్వు ఐఏఎస్‌ చేయాలి అనేది. అది చిన్నపుడే నాలో నాటుకుంది. అమ్మకి ఆ కోరిక ఎందుకు కలిగిందంటే.. 2001లో మా సొంత మండలం కొమరోలు (ప్రకాశం జిల్లా) జడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు రిజర్వు అయింది. బీసీ జనరల్‌ అయివుంటే నాన్న వెంకటయ్య పోటీ చేసివుండేవారు. మహిళకు రిజర్వు కావడంతో అమ్మ పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచారు. నాన్న కూడా సర్పంచుగా, జట్పీటీసీగా పనిచేశారు. ప్రజాప్రతినిధులు కావడం వల్ల వారికి కలెక్టర్‌ వంటి ఐఏఎస్‌ అధికారులను కలిసే అవకాశం ఉండేది. దాంతో నన్ను ఐఏఎస్‌ ఆఫీసర్‌గా చూడాలన్న ఆశ, పట్టుదల అమ్మకు ఇంకా ఎక్కువైంది. ప్రతి సందర్భంలోనూ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండేవారు. అందుకే మెడిసిన్‌ పూర్తి చేసినప్పటికీ డాక్టర్‌గా కొనసాగకుండా కేవలం అమ్మకోసమే సివిల్స్‌ వైపు దృష్టి మళ్లించా. తొలి రెండు ప్రయత్నాలలో ఆలిండియా సర్వీస్‌సకు ఎంపికైనా అమ్మ కోసమే పట్టుదలగా ప్రయత్నించి మూడవసారి ఐఏఎస్‌ సాధించా. ఆ క్షణం అమ్మ పడిన సంబరం, సంతోషం వర్ణించలేను. తనే ఐఏఎస్‌ సాధించినట్టు ఫీలయ్యారు. ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన రోజు నా కుర్చీలో కూర్చోబెట్టినపుడు ఆమ్మ కళ్లలోని ఆ మెరుపులు చాలు నా జీవితానికి అనిపించింది. అలాగే రిపబ్లిక్‌ డే ఉత్సవాలలో రాష్ట్రపతి ప్రతినిధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, పోలీసు గౌరవ వందనం స్వీకరించడం వంటి సందర్భాలు ప్రత్యక్షంగా చూసిన అమ్మ గర్వపడిన క్షణాలను ఎప్పటికీ మరచిపోలేను. పిల్లల కోసం ఇన్ని త్యాగాలు చేసిన అమ్మకు సంతోషం కలిగించడం తప్ప ఇంకేం ఇవ్వగలం.. అమ్మ రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది.. ఏ బిడ్డలకైనా!

పెళ్లికాక ముందే పుట్టినింటి భారం

అమ్మ పేరు కాశమ్మ. నర్సింగ్‌ కోర్సు చేశారు. ఇంటి పరిస్థితి అమ్మని పెళ్లి కాక ముందే సౌదీ అరేబియాకు చేర్చింది. అప్పటికి అమ్మ వయసు 19 ఏళ్లట. అక్కడ నర్స్‌గా ఉద్యోగం చేస్తూ అమ్మ నాన్నా అమ్మలకు, తోబుట్టువులకు అండగా నిలిచారు. పెళ్లి తర్వాత కూడా చాలా వరకూ వారి మంచిచెడ్డలు పట్టించుకున్నారు.

చిన్నతనంలో అమ్మను బాగా మిస్సయ్యా!

అమ్మ ఇరవై ఏళ్లు సౌదీ అరేబియాలో ఉద్యోగం చేశారు. పెళ్లయ్యాక, మేము పుట్టాక కూడా అక్కడే కొనసాగారు. ఏడాదికి రెండుసార్లు వచ్చి మమ్మల్ని చూసి వెళ్లేవారు. చిన్నతనంలో అమ్మను బాగా మిస్సయ్యా. నేనే కాదు మా అన్న, అక్కలు అందరికీ ఆ వెలితి ఉండేది. అప్పట్లో అమ్మ మాతో లేకపోవడం వల్ల ఒకటవ తరగతి నుంచే నన్ను హాస్టల్‌లో చేర్చారు. తర్వాత నా చదువంతా అలానే హాస్టల్‌లోనే గడిచింది.

మాకోసం కెరీర్‌నే వదులుకున్నారు!

మా కోసం అమ్మ తన ఉద్యోగాన్ని, కెరీర్‌ను పూర్తిగా వదులుకున్నారు. నేను హైస్కూలు చదువు స్థాయికి వచ్చేసరికి ఎదిగే వయసులో పిల్లలతో గడపాలని, మా మంచి చెడ్డలు చూడాలని సౌదీ అరేబియాలో ఉద్యోగం వదిలిపెట్టేసి వచ్చేశారు. నిజానికి సౌదీలో ఇరవై ఏళ్ల అనుభవం ఉన్నందున ఇక్కడికి వచ్చాక సిటీల్లో ఏ కార్పొరేట్‌ ఆస్పత్రిలో అయినా మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉండింది. కేవలం మా కోసమే అమ్మ అలాంటి ప్రయత్నం చేయలేదు. మాతోనే ఉండిపోయి తన కెరీర్‌నే పూర్తిగా వదులుకున్నారు.

ఆమె కష్టాలూ, త్యాగాలూ వెలకట్టలేను !

మాది పెద్ద కుటుంబం. ఐదుగురు పిల్లలం. ఒక అన్న, ముగ్గురు అక్కల తర్వాత నేను. అంతమందిని చదివించి పెంచి పెద్ద చేయడం అంటే మాటలు కాదు. అమ్మ ఉద్యోగం వదులుకుని వచ్చేశాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. వాటి తీవ్రత, అమ్మ పడిన కష్టాల గురించి అంతకుమించి చెప్పలేను. మా కోసం తను పడిన కష్టాలు, చేసిన త్యాగాలకు వెలకట్టలేను.


నా విజయంలో సగం ఆమెదే: తిరుపతి నగర కమిషనర్‌ మౌర్య

అమ్మ జయశ్రీ పెద్దచదవరి కాదు. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని నాగులపల్లి. పల్లెలో పుట్టి పెరిగిన అమ్మ.. బిడ్డల కోసం పెద్ద కలలు కనింది. ఆ కలలు నెరవేరడానికి కొండలా నిలబడింది. నా ఐఏఎస్‌ సాధనయాత్రలో అమ్మ కష్టం.. అమ్మ త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే! నాకు అమ్మంటే ఇష్టం. అమ్మకు చదవంటే ఇష్టం. అమ్మ కళ్లలో మెరుపుకోసం మరింత కష్టపడి చదివేదాన్ని. సివిల్స్‌ కోసం ఢిల్లీకి వెళితే అమ్మ నాతోపాటు వచ్చేది. ఢిల్లీలో చిన్న అద్దెగదిలో అమ్మా..నేనూ.. ఇద్దరమే ఉండేవాళ్లం. ప్రతి పరీక్షకూ అమ్మ నాతోపాటూ సెంటర్‌కు వచ్చేది. ఇంట్లోనే అన్నం కూరలూ చేసి తెచ్చేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే కాసుకుని ఉండేది. సివిల్స్‌కి నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యా. ఇక సాధించగలనా? అన్న అనుమానం కలిగి అసంతృప్తిచెందినప్పుడు.. అమ్మ నాకు బాసటగా నిలచింది. వెన్నుతట్టి ప్రోత్సహించేది. చాలా ధైర్యం చెప్పేది. ఆ తర్వాత హైదరబాద్‌కు వచ్చేశాం. అక్కడ ఒక ఫ్లాట్‌ తీసుకుని ఐదోసారి సివిల్స్‌కు ప్రయత్నించా. అప్పుడు కూడా అమ్మ ఇల్లొదిలి వచ్చి నాతోపాటు ఉండిపోయింది. ఐదో ప్రయత్నంలో ర్యాంకు సాధించా. నా ఐఏఎస్‌ ప్రయత్నంలో కష్టం అమ్మదే. ఆ విజయంలో సగం అమ్మకే దక్కుతుంది.

ఇప్పుడూ ఆమే!

ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అమ్మ నాకు ఆసరాగానే ఉంది. విధి నిర్వహణలో ఎక్కువ సమయం బయట ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కువగా అమ్మ ఉంటుంది. మా బాబును ఆమే చూసుకుంటుంది. నాకు స్వేచ్ఛ ఇచ్చింది. విలువలు నేర్పింది. అమ్మ నా మార్గదర్శి కూడా. 62 ఏళ్ల వయస్సులో ఇప్పుడు కూడా ఆమె సలహాలు బాగా ఇస్తారు. ఏదైనా బాధ, సంతోషం కలిగినప్పుడు పెళ్లికి ముందు అమ్మతోనే షేర్‌ చేసేకునేదాన్ని. పెద్ద రిలీఫ్‌ అనిపించేది. ఇప్పుడు భర్తతో పంచుకుంటా.

Updated Date - May 11 , 2025 | 01:51 AM