Share News

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

ABN , Publish Date - Jun 10 , 2025 | 02:42 AM

‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్‌ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?
సాక్షి కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు - గేటు వద్ద దూసుకెళుతూ..

రేణిగుంట, జూన్‌ 9 (ఆంరఽధజ్యోతి): ‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్‌ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు. ఆ ఛానల్‌ చర్చలో వాడిన అసభ్యపదజాలాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాయంత్రం రేణిగుంటలోని సాక్షి ప్రధాన కార్యాలయం ఎదుట కూటమి నాయకులు, మహిళలు ఆందోళనకు దిగారు. మాజీ సీఎం జగన్‌, ఆ ఛానల్‌ అధినేత భారతిరెడ్డి వెంటనే అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక దశలో ఆగ్రహావేశాలు తట్టుకోలేక సాక్షి కార్యాలయం వైపు రాళ్లు రువ్వారు. మహిళలు లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని నిలువరించారు. ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌, సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రుద్రకోటి సదాశివం తదితరులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో వైసీపీ నాయకులు కుట్ర ప్రకారం బురదజల్లేందుకు సోషల్‌ మీడియా వేదికగా దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా పనికిమాలిన మాటలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా, ఇవేమీ పట్టనట్టు తిరిగి వైసీపీ నాయకుడు సజ్జల మీడియా ముందు తాము తప్పు ఏమీ చేయలేదన్నట్టు సమర్ధించుకోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే సాక్షి ఛానల్‌, పత్రికను మూసివేయాలని డిమాండ్‌ చేశారు.


ఈ కార్యక్రమంలో టీడీపీ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ, నాయకులు కోడూరు బాలసుబ్రమణ్యం, కార్పొరేటర్‌ అనిత, చినబాబు, కృష్ణయాదవ్‌, మధుబాబు, సుబ్రమణ్యం యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకారులపై సాక్షి ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 10 , 2025 | 02:42 AM