Alipiri: అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు
ABN , Publish Date - Jun 10 , 2025 | 02:25 AM
తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.

తిరుమల, జూన్ 9(ఆంధ్రజ్యోతి): తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది. తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రంలో తిరుమలకు వెళ్లే ప్రతి వాహనాన్ని, భక్తులను, లగేజీని తనిఖీ చేస్తుంటారు. ఇక్కడ 12 లైన్లు ఉన్నాయి. ఇందులో ఒక లైన్ను వీఐపీల కోసం, మరో రెండు లైన్లను ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య చెక్పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి.
ఇవీ కారణాలు..
వాహనాలు భారీగా నిలిచిపోవడానికి వివిధ రకాల కారణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ ముందు వరకు రోజుకు 7,500 నుంచి 8 వేల వరకు వాహనాలు తిరుమలకు వచ్చేవి. కొవిడ్ సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టు కన్నా ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం క్షేమమని భావించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. గ్రామాల నుంచి కూడా కొందరు కలిసి ట్యాక్సీ మాట్లాడుకుని రావడానికి అలవాటు పడ్డారు. దీంతో ప్రస్తుతం సాధారణ రోజుల్లో 9 వేలు, రద్దీరోజుల్లో 10 వేల వాహనాలు తిరుమలకు చేరుకుంటున్నాయి. దీంతో పాటు 2022లో ఏర్పాటు చేసి స్కానర్లలో చాలా వరకు సక్రమంగా పనిచేయడం లేదు. ఇందువల్ల ఆలస్యమవుతున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీల విధుల్లో ఎస్పీఎఫ్ సిబ్బంది 35 నుంచి 40 మంది, విజిలెన్స్ సిబ్బంది 24 మంది ఉంటారు. ఈ సంఖ్య సరిపోవడం లేదు.
విస్తరణపై దృష్టి
అలిపిరి తనిఖీ కేంద్రాన్ని మరింత విస్తరించడం తప్ప మరోదారి లేదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న 12 లైన్లను 14 లైన్లుగా మార్చడం ఇందులో ఒకటి. అలాగే అత్యాధునిక స్కానర్లు, సిబ్బంది పెంపు, వారికి ప్రత్యేక శిక్షణ వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇవి అమలైతే అలిపిరిలో నిరీక్షణ సమయం తగ్గే అవకాశం ఉంది.