Share News

Children Drowned in Water: ఆటలోనే జల సమాధి

ABN , Publish Date - May 19 , 2025 | 03:51 AM

చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నీటిలో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. కుప్పంలో ముగ్గురు, బుట్టాయగూడెంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ జల సమాధి చెందారు.

Children Drowned in Water: ఆటలోనే జల సమాధి

  • 2 జిల్లాల్లో నీట మునిగి ఐదుగురు చిన్నారుల అకాల మరణం

  • చిత్తూరులో నీటికుంటలో పడి ముగ్గురు...

  • పశ్చిమలో జలాశయంలో పడి ఇద్దరు..

కుప్పం, బుట్టాయగూడెం, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఐదుగురు చిన్నారులు అకాల మరణం చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో ముగ్గురు చిన్నారులు నీటికుంటలో పడి మృతి చెందగా, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారులు జలాశయంలో దిగి ఆడుకుంటూ మునిగిపోయారు. వివరాలివీ.. కుప్పం మండలం దేవరాజపురంలో చర్చి సమీప గుడిసెల్లో తిరుపతి, వరలక్ష్మిల కుమార్తె గౌతమి (7), రాజ, సుమతిల కుమార్తె షాలిని (6), శరవణ, యశోదల కుమారుడు అశ్విన్‌ (7) నివాసం ఉంటున్నారు. పిల్లలు ముగ్గురూ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వాన ఆగాక ఇళ్లకు సమీపంలో ఆడుకుంటున్నారు. అక్కడ చర్చికి ఆనుకుని ఇటీవల ఏదో కట్టడం కోసి తీసిన గోతిలో వాననీరు నిండి ఉంది. ఆడుకుంటూ ఆ కుంటలో ప్రమాదవశాత్తూ పడి మునిగిపోయారు. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో ముగ్గురు చిన్నారులూ మృతి చెందారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన షేక్‌ అన్వర్‌, ఫర్విన్‌ దంపతులకు సిద్దిక్‌ (11), అబ్దుల్‌ మజీద్‌ (7) ఇద్దరు కుమారులు. అన్వర్‌ తాడేపల్లిగూడెంలో ఫుట్‌పాత్‌పై బట్టలు, ఫ్యాన్సీషాపు నడుపుకుంటూ జీవనం సాగి స్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఫర్విన్‌ పిల్లలను తీసుకుని రెండు రోజుల క్రితం పుట్టినిల్లయిన ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం వచ్చారు. ఆదివారం బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయం చూడటానికి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు జలాశయంలో దిగి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈతగాళ్లతో గాలించి.. చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు.

Updated Date - May 19 , 2025 | 03:53 AM