Share News

Chandrababu: పరామర్శకని వెళ్లి.. అరాచకమేంటి

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:00 AM

రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శాంతిభద్రతల సమస్య సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనలకు వెళ్లి ఈ అరాచకాలేమిటని నిలదీశారు.

Chandrababu: పరామర్శకని వెళ్లి.. అరాచకమేంటి

  • అనుమతులిస్తే.. అలుసుగా తీసుకుంటారా!

  • మహిళలు, పోలీసులపైనే రాళ్ల దాడి చేస్తారా?

  • జగన్‌ ఉద్దేశం రైతు సమస్యలు కాదు

  • అలజడి సృష్టించి ఉనికి చాటుకునే యత్నం

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం

  • పొదిలి ఘటనపై చంద్రబాబు సీరియస్‌

  • చట్టపరంగా చర్యలకు డీజీపీకి ఆదేశం

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): రైతులకు పరామర్శ పేరుతో ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ శాంతిభద్రతల సమస్య సృష్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పేరుతో పర్యటనలకు వెళ్లి ఈ అరాచకాలేమిటని నిలదీశారు. మహిళలు, పోలీసులపై రాళ్లు వేస్తారా? అని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వాళ్లపై ఆధారాలు సేకరించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీహరీష్ కుమార్‌ గుప్తాను సీఎం ఆదేశించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర విషయంలో పరామర్శ పేరుతో బుధవారం జగన్‌ చేసిన రాజకీయ యాత్రలో వైసీపీ శ్రేణులు రాళ్లతో మహిళలపై దాడులకు దిగడంపై సీఎం సీరియస్‌ అయ్యారు. ‘రైతుల పరామర్శకు వెళ్తే జిల్లావ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు? వెళ్లింది రైతుల కోసమా? లేక దాడుల కోసమా? నా ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావు లేదు. ప్రజా సమస్యల పేరుతో జనంలోకి వెళ్లి, లా అండ్‌ ఆర్డర్‌ సమస్య సృష్టిస్తున్నారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే.. దాన్ని అలుసుగా భావిస్తారా! అనుమతులను దుర్వినియోగం చేస్తారా? జగన్‌ పర్యటనలు చూస్తుంటే.. తన ఉద్దేశం రైతు సమస్యలు కాదు. అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమేనని అర్థమవుతోంది. రాజకీయ ఎజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదు’ అని సీఎం స్పష్టం చేశారు. సమస్య ఉంటే నిరసన తెలపడానికి, పరామర్శకు వెళ్లడానికి అభ్యంతరం లేదని, ప్రభుత్వం ఎక్కడా అనుమతులు నిరాకరించడం లేదని తెలిపారు. కానీ, ప్రతి పర్యటనలో వాళ్లు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వాళ్లు ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి అనుమతి ఇస్తున్నాం.


అలా అని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే మాత్రం సహించేది లేదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలి. శాంతిభద్రతల సమస్య సృష్టించి, రాళ్ల దాడి చేసి, పోలీసులతోపాటు పలువురు గాయపడటానికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని డీజీపీని సీఎం ఆదేశించారు. ‘జగన్‌ సొంత టీవీ చానెల్‌లో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా నీచమైన వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భగ్గుమన్నారు. ఆ వికృత వ్యాఖ్యలను, ప్రచారాన్ని అన్ని వర్గాలు ఖండించాయి. అయితే జగన్‌ మాత్రం ఇప్పటికీ వాటికి క్షమాపణ చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు నాయకులుగా చలామణి అవుతానంటే ఎలా? ప్రజలు ఎలా అంగీకరిస్తారు? ఆడబిడ్డలు నిరసన వ్యక్తం చేస్తే.. వారిపై దాడులు చేస్తారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 03:02 AM