Land Encroachment: బుగ్గమఠం భూముల్లో రుబాబు
ABN , Publish Date - May 04 , 2025 | 04:05 AM
తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వేకు వెళ్లిన అధికారులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు.

సర్వే జరక్కుండా పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యం
మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారులతో ఘర్షణ
బైక్ తాళం లాక్కుని పోలీసుల ఎదుటే వీరంగం
బుగ్గమఠం భూముల్లో 14.49 ఎకరాలు కబ్జా
మఠం ఫిర్యాదుతో పెద్దిరెడ్డి సహా పలువురికి నోటీసు
తాఖీదులకు స్పందించని మాజీ మంత్రి
పైగా సర్వేకు వెళ్లిన అధికారులపై అరాచకం
ఎట్టకేలకు అతికష్టం మీద సర్వే పూర్తిచేసిన వైనం
తిరుపతి, మే 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఆక్రమణలకు గురైన బుగ్గమఠం భూముల సర్వేకు వెళ్లిన అధికారులపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. శనివారం ఉదయం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు.. సర్వే జరిగినంత సేపూ అధికారులతో ఘర్షణ పడటమో, వారితో వాగ్వాదానికి దిగడమో చేస్తూ ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. పెద్దిరెడ్డి ఇంటి ఆవరణలో సర్వే జరపకుండా పలుసార్లు అడ్డుకున్నారు. సర్వే ముగించి వెనుదిరిగిన అధికారులను మరోసారి అడ్డగించి, బైక్ తాళాలు లాక్కొని దౌర్జన్యం చేశారు. సర్వే అధికారులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషించారు. చివరికి డీఎస్పీ గట్టిగా ఆదేశించడంతో కదిలి ఆందోళనకారులను నియంత్రించారు. ఇక భూదందా విషయానికి వస్తే.. తిరుపతి అర్బన్ మండలం ముత్యాలరెడ్డిపల్లె ప్రాంతంలోని 261-1, 261-2, 314-1బి, 314-2, 314-3ఏ, 315-1 తదితర ఆరు సర్వే నంబర్లలో 14.49 ఎకరాల బుగ్గమఠం భూములు అన్యాక్రాంతమయ్యాయని మఠం అధికారులు గుర్తించారు. ఆక్రమణదారుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా ఉన్నారని గుర్తించి ఆక్రమణలు తొలగింపునకు నోటీసులు ఇచ్చారు. దానిపై మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి మఠం భూముల సర్వే కోసం అధికారులు ప్రయత్నిస్తుండగా, శనివారం ఎట్టకేలకు ఆ ప్రక్రియ మొదలైంది. అంతకు మునుపే మఠం అధికారులు సర్వే కోసం మరోసారి పెద్దిరెడ్డితో పాటు మరో నలుగురికి నోటీసులు జారీచేశారు. అయితే ఆ భూములతో తనకు సంబంధం లేదని, వాటిని తన సోదరుడు ద్వారకానాథరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు.
ఈ క్రమంలో శనివారం ఉదయం 10.45 గంటలకు బుగ్గమఠం ఏసీ వెంకటేశ్వర్లు, జిల్లా దేవదాయ శాఖ ఏసీ రామకృష్ణారెడ్డి, మఠం సిబ్బంది, జిల్లా సర్వేయర్ చిట్టిబాబు, తిరుపతి అర్బన్ మండల సర్వేయర్, సిబ్బంది పెద్దిరెడ్డి ఇంటి సమీపానికి చేరుకున్నారు. పోలీసులు కూడా బందోబస్తు నిమిత్తం అక్కడే ఉన్నారు. మఠం అధికారులను చూడగానే ఆక్రమణదారులు సర్వే చేయడానికి లేదంటూ అడ్డుకున్నారు. వారం పది రోజులు ముందుగా నోటీసులు ఇవ్వకుండా ముందు రోజు సాయంత్రం నోటీసులు ఇచ్చి వెంటనే సర్వేకు ఎలా వస్తారని ప్రశ్నించారు. తమ వద్ద భూముల పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించిన రశీదులు ఉన్నాయని దబాయించారు. ఇప్పటి మార్కెట్ ధర చెప్పినా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని, ఇవి తమ భూములని తేల్చిచెప్పారు. తమ భూముల్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ అడ్డుపడ్డారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. మఠం, దేవాదాయశాఖ అధికారులు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆక్రమణదారులు రెచ్చిపోయారు.
గంట ఆలస్యంగా..
పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుపడటంతో గంట పాటు సర్వే ప్రారంభం కాలేదు. సమాచారం అందుకున్న తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఎస్వీయూ, అలిపిరి, ఈస్ట్ సీఐలు, టాస్క్ఫోర్స్ బలగాలతో 11.45కు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనే స్వయంగా ఆక్రమణదారులను పక్కకు నెట్టేశారు. దీంతో పోలీసులు వారిని అదుపు చేయడంతో సర్వే ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు రోవర్ పరికరంతో సర్వే చేపట్టారు. దీనికి పదేపదే ఆక్రమణదారులు అడ్డుపడుతూ వచ్చారు. సుధహ స్కూలు సమీపంలో సర్వే నిర్వహిస్తుండగా అక్కడ కూడా అంతరాయం కలిగించారు. వెస్ట్ రైల్వే గేటు వద్ద కూడా ఆటంకం కలిగించారు. కొబ్బరి కాయల మండీ వెనుకవైపు కూడా సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. ప్రతిచోటా డీఎస్పీ, సీఐలు జోక్యం చేసుకుని వారికి పక్కకు నెట్టేసి సర్వే జరిగేలా చూశారు.
పెద్దిరెడ్డి ఇంటి వద్ద హల్చల్
పెద్దిరెడ్డి నివాసానికి తూర్పు గేటు నుంచి ఆవరణలోకి ప్రవేశించేందుకు యత్నించిన మఠం, దేవదాయ, రెవెన్యూ సర్వే అధికారులు, సిబ్బందిని పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తమ ఇళ్లలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. సర్వేకు ఎవరు అనుమతి ఇచ్చారు? అనుమతులు చూపండి అంటూ దబాయించారు. ఇంటికి ఇరువైపులా సర్వే చేసే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడ నుంచి పంపేశారు. 12.45 గంటలకు సర్వే ముగించి అధికారులు వెనుదిరగ్గా.. బుగ్గమఠం అకౌంటెంట్ బాలాజీ బైక్కు అడ్డుపడ్డ ఆక్రమణదారులు బైక్ తాళాలు లాక్కున్నారు. కాగా, రూ.వందల కోట్ల విలువైన భూముల సర్వే వ్యవహారమని తెలిసినా కనీసం అర్బన్ మండల తహసీల్దారు గానీ, ఆర్డీవో గానీ అక్కడికి రాకపోవడం విమర్శలకు దారి తీసింది.