AP Govt: రామాయపట్నంలో బీపీసీఎల్కు మరిన్ని ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:44 AM
నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

ప్రాజెక్టు పురోగతి సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ
అమరావతి, జూన్ 11(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా రామాయపట్నం ఓడరేవు సమీపంలో భారీ పెట్టుబడులతో గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు ప్రోత్సాహకాలను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడానికి మార్గదర్శకాల జారీ, ప్రభుత్వ ప్రోత్సాహకాల క్లెయిమ్ల ప్రాసెసింగ్ ప్రాజెక్టు పనుల పురోగతి నిరంతర సమీక్షకు ఉన్నతస్థాయి కమిటీ (ప్రాజెక్టు అమలు యూనిట్- పీఐయూ)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర పరిశ్రమలశాఖ కమిషనర్/ డైరెక్టర్ అధ్యక్షతన వివిధ శాఖలకు చెందిన 16 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఏర్పాటు చేసిన ఈ హైలెవెల్ కమిటీ ప్రతినెలా సమావేశమవుతుంది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంట్కు అనుమతులను సులభతరం చేయడానికి పీఐయూను ప్రభుత్వం పునర్నియమించింది. ఆర్ అండ్బీ చీఫ్ ఇంజినీర్, ఇంధనశాఖ డిప్యూటీ సెక్రటరీ, వాణిజ్య పన్నుల శాఖ ప్రతినిధి ఇందులో సభ్యులు.