Ongole: సీఐపై మందుబాబుల దాడి
ABN , Publish Date - May 20 , 2025 | 06:36 AM
ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై మద్యం సేవించి మందుబాబులు దాడి చేసి, అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దుండగులు పరారయ్యారు.

ఒంగోలులో అర్ధరాత్రి గస్తీలో ఉండగా ఘటన
ఒంగోలు క్రైం, మే 19 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఉన్న ప్రకాశం జిల్లా ఒంగోలు టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావుపై ముగ్గురు మందుబాబులు దాడి చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఒంగోలులో ఆదివారం రాత్రి గస్తీలో ఉన్న సీఐ శ్రీనివాసరావు కర్నూల్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద బీట్ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో సమీపంలోని ఓ లాడ్జి వద్ద అరుపులు వినిపించాయి. అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే ఓ మోటార్ సైకిల్ కిందపడి ఉంది. దాన్ని పైకి లేపేందుకు మద్యం సేవించిన ఇరువురు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. వారి వద్ద కానిస్టేబుల్ను ఉంచిన సీఐ.. కొద్దిదూరంలో మోటారు సైకిల్ను స్టార్ట్ చేసే పనిలో ఉన్న మరో వ్యక్తి వద్దకు వెళ్లారు. అతను కూడా మద్యం సేవించినట్టు గుర్తించి వాహనం తాళాన్ని తీసుకునేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతున్న సమయంలో మోటారు సైకిల్ను లేపేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిలో ఒక వ్యక్తి సీఐ వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డాడు. మిగిలిన ఇద్దరు కూడా చేయిచేసుకున్నారు. దీంతో సీఐ ముఖంపైన గాయమైంది. డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, రూరల్ సీఐ శ్రీకాంత్బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. కేసు నమోదుచేసినట్టు తాలుకా ఇన్చార్జి సీఐ శ్రీకాంత్బాబు తెలిపారు.