APSRTC: అవినీతి విజిలెన్స్ పై ఆర్టీసీ వేటు
ABN , Publish Date - May 11 , 2025 | 04:57 AM
ఆర్టీసీ యాజమాన్యం అవినీతి చేస్తున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకుంది. కడప, విజయవాడ జోన్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.

కడప జోన్లో వీ అండ్ ఎస్వో రెహమాన్ సస్పెన్షన్..
సహకరించిన 9 మంది సిబ్బందిపైనా చర్యలు
విజయవాడలో ‘సరదా బుల్లోడు’ వీఆర్కు
వత్తాసు పలికిన ఏడీపైనా విచారణ, చర్యలకు రంగం సిద్ధం
అమరావతి, కడప మారుతీనగర్, మే 10(ఆంధ్రజ్యోతి): టాప్ గేర్లో అవినీతికి పాల్పడుతోన్న విజిలెన్స్ అధికారులు, సిబ్బందిపై ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. కింది స్థాయి సిబ్బందిని వేధించి, పీడిస్తోన్న అధికారిని సస్పెండ్ చేసింది. ఈ అవినీతిలో భాగస్వాములై వసూళ్లకు పాల్పడిన విజిలెన్స్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను సైతం ఇంటికి పంపించింది. చిన్న ఉద్యోగి నుంచి వితంతువు వరకూ ఎవ్వరినీ వదలకుండా నగదు కవర్లు, నోట్ల కట్టలు తీసుకుంటున్న విజిలెన్స్ అధికారుల్ని భరించలేక కింది స్థాయి సిబ్బంది ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన విజిలెన్స్ మహిళా అధికారి కడప, బెజవాడలో అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చారు. దీంతో బాధితుల ఆవేదనను ‘కంచె.. మేస్తోంది’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. స్పందించిన యాజమాన్యం నెల్లూరుకు చెందిన మరో అధికారితో పకడ్బంధీ విచారణ జరిపించడంతో కడప జోన్ విజిలెన్స్ అధికారుల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి నెలా మామూళ్లు, సెలవు పెడితే డబ్బులు, ఆలస్యమైతే చర్యలు.. రద్దు చేసేందుకు లంచం, ఆఖరికి వితంతువును బ్లాక్ మెయిల్ చేసి రూ.5 లక్షలు గుంజిన వైనం ఆధారాలతో సహా నిరూపితమైంది. ఫోన్లో డబ్బులు అడిగిన వాయిస్ రికార్డుల నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపిన స్ర్కీన్ షాట్లు ఆధారాలుగా జతచేసి యాజమాన్యానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కడప జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ ముజిబుర్ రెహమాన్ను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సస్పెండ్ చేశారు.
ఆయనకు సహకరించి అవినీతి అక్రమాల్లో భాగస్వాములైన హెడ్ కానిస్టేబుళ్లు కేవీ రెడ్డి(పులివెందుల), జీవీ గిరి రమణ (గుత్తి), ఆర్.శంకరయ్య(రాజంపేట), కానిస్టేబుళ్లు ఎన్పీఎల్ఎన్వీ ప్రసాద్(కడప), యూఎన్ఎ్స రెడ్డి (కదిరి), ఎ.మనోహర్(నంద్యాల), కేఆర్సీ రెడ్డి(నంద్యాల), ఆర్ఎంఎస్ నాయక్(కడప బస్టాండ్), పి.శ్రావణ్కుమార్(ఆర్టీసీ కడప జోనల్ వర్క్షా్ప)లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరి అవినీతిలో భాగస్వామి అయిన వైద్యురాలు అపర్ణపైనా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇదిలాఉండగా విజయవాడ జోన్లో ఇదేతరహా వ్యవహారాలు చేస్తోన్న ఎస్జేఏ దేవదాసన్ బాధితులు తమగోడు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లకు సైతం ఆయన వేధిస్తున్న తీరు ఆధారాలతో సహా లభించడంతో ‘సరదా బుల్లోడు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. విచారణకు ఆదేశించిన యాజమాన్యం పలు ఆధారాలు లభించడంతో దేవదాసన్ను పోస్టు నుంచి తప్పించి ఆర్టీసీ హౌస్లో వెయిటింగ్లోకి పంపింది. ఏపీఎ్సఆర్టీసీ చరిత్రలో విజిలెన్స్ అధికారులపై ఇంత భారీస్థాయిలో ఎన్నడూ చర్యలకు ఉపక్రమించని యాజమాన్యం తాజాగా తీసుకున్న నిర్ణయం పెద్ద చర్చనీయాంశమైంది.
విజిలెన్స్పై ఫిర్యాదుల వెల్లువ..
మనిషికి కళ్లు, చెవులు ఎంత ముఖ్యమో.. ఒక సంస్థకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అంతే ముఖ్యం. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా జరిగే సంస్థల్లో ఆ విభాగం మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి నెలా రూ.500కోట్ల ఆదాయం ఆర్జించే ఏపీఎ్సఆర్టీసీలో అదేమీ కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అధిపతిగా ఉండేవారు. జోన్ల వారీగా డీఎస్పీ ర్యాంకు అధికారులు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉండేవారు. అప్పట్లో ప్రతి చిన్న లోపం గుర్తించి నివేదికలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపితే తక్షణమే చర్యలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ఒక అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో విజిలెన్స్ విభాగం నిద్రపోతోంది.
ఏడీకి రూ.3.50 లక్షలు..
ఏపీఎస్ఆర్టీసీ విజిలెన్స్లో ఏడీగా పనిచేస్తున్న మహిళా అధికారిపైనా అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కడప జోన్లో వచ్చిన ఫిర్యాదులపై విచారణకు వెళ్లిన ఆమె అవినీతి అధికారులకు క్లీన్ చిట్ ఇచ్చి చిక్కుల్లో పడ్డారు. పక్కా ఆధారాలు సమర్పించినా ఎందుకు చర్యలు తీసుకోలేదనే చర్చ ఆర్టీసీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీంతో యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఒక ఉద్యోగి తొలగింపు వ్యవహారంలో ఆమె రూ.3.5 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. జిల్లాల్లోని అధికారుల నుంచి మామూళ్లు తీసుకున్నారనే ఆరోపణలపైనా విచారణాధికారులు ఆధారాలు సేకరించి నివేదికతోపాటు యాజమాన్యానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెపై నేడో, రేపో చర్యలు తప్పవనే ప్రచారం ఆర్టీసీ వర్గాల్లో వినిపిస్తోంది.