Bholebaba Dairy case: కల్తీ నెయ్యి కేసు: బోలేబాబా డైరీ బెయిల్ పిటిషన్ల విచారణ
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:10 PM
తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో బోలేబాబా డైరీ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ ఇవాళ ఏపీ హైకోర్టులో జరిగింది. ఈ కేసులో తమ క్లైంట్లు నాలుగు నెలలుగా జైల్లోనే ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ..

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో భోలేబాబా డైరీ నిందితుల బెయిల్ పిటిషన్ల విచారణ ఇవాళ ఏపీ హైకోర్టులో జరిగింది. తీర్పును రిజర్వ్లో ఉంచిన ఏపీ హైకోర్టు.. కేసును ఈనెల 26కు వాయిదా వేసింది. ఒక్క టీటీడీకే కాదు.. ఇతర దేవాలయాలకు నకిలీ నెయ్యి సరఫరా చేశారని ఈ సందర్భంగా సీబీఐ కోర్టుకు వివరించింది. పలు దేవస్ధానాల్లో ప్రసాదాల తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేశారని చెప్పారు. 'ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ను ఇచ్చారు. రంగు, సువాసన కోసం పామాయిల్లో రసాయనాలు కలిపారు. టీటీడీ నుంచే నిందితులు 240 కోట్లు లబ్ది పొందారు. నకిలీ నెయ్యి తయారీ సరఫరాలో భోలేబాబా డైరీది కీలకపాత్ర. ఏఆర్, వైష్ణవి డైరీతో కలిసి నకిలీ నెయ్యి తయారీపై కుట్ర చేశారు. జైన్ సొదరుల అనుచరులు సాక్షులను బెదిరిస్తున్నారు. ఈ విషయంలో కేసులు కూడా నమోదు చేశాం.' అని సీబీఐ.. హైకోర్టు ముందు తన వాదనల్ని వినిపించింది. టీటీడీ లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరాలో నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సిబిఐ కోరింది.
అయితే, నిందితుల తరపు న్యాయవాదులు తమ క్లైంట్లకు బెయిల్ ఇవ్వాలంటూ వారి వాదనల్ని కోర్టు ముందుంచారు. 'గత 4 నెలలుగా నిందితులు జైలులో ఉన్నారు. సిట్ దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ దాఖలు చేసింది. దర్యాప్తుకు సహకరిస్తాం.. షరతులకు కట్టుబడి ఉంటాం.బెయిల్ మంజూరు చేయండి.' అని పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. అటు, వైష్ణవి డైరీ సిఈఓ అపూర్వ చావడా బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు రిజర్వు చేసి కేసును వాయిదా వేసింది.
ఇవీ చదవండి:
కౌంటీల్లో దుమ్మురేపిన తెలుగోడు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి