Share News

AP Government: ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - May 16 , 2025 | 02:57 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి ఇచ్చింది. మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీ ప్రక్రియ కొనసాగనుంది.

AP Government: ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

  • నేటి నుంచి జూన్‌ 2 వరకు ట్రాన్స్‌ఫర్లు

  • మే 31 నాటికి ఐదేళ్ల సర్వీస్‌ పూర్తయితే తప్పనిసరి

  • ఉమ్మడి జిల్లాలు యూనిట్‌గా ప్రక్రియ

  • జూన్‌ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం

అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 16 నుంచి జూన్‌ 2 వరకు బదిలీలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ మార్గదర్శకాలతో గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2025, మే 31 నాటికి ఒకే స్థానంలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. ఐదేళ్ల సర్వీసు పూర్తికాని వారు కూడా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వారి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుని, పరిపాలనా సౌలభ్యం మేరకు బదిలీలు చేయవచ్చని తెలిపారు.


అనారోగ్య బాధితులకు ప్రాధాన్యత..

దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక దివ్యాంగ పిల్లలు కలిగిన ఉద్యోగులకు వైద్యవసతి కలిగిన ప్రదేశాలకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు, 40 శాతంపైగా అంగవైకల్యం కలిగిన ఉద్యోగులకు, దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తదితర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. కాగా, దివ్యాంగ ఉద్యోగులు కోరుకుంటే తప్ప వారిని బదిలీ చేయరాదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ తరహా ఉద్యోగులను వారు కోరిన చోట ఖాళీలను బట్టి ట్రాన్స్‌ఫర్‌ చేసేలా వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే ఇద్దరినీ ఒకే చోట ఉంచేందుకు, అలా వీలుకాకపోతే పక్క పక్క ప్రాంతాల్లో సర్దుబాటు చేసేలా చూడాలని సూచించారు. పదోన్నతి పొందినఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని, ఆ పోస్టు ఇతర ప్రాంతాల్లో లేకపోతే అదే స్థానంలో కొనసాగించవచ్చని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో లోకల్‌ కేడర్‌, జోనల్‌ కేడర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకుంటే వారు కోరుకున్న చోటకు బదిలీ చేయాలని సూచించారు. ఐటీడీఏ ప్రాంతానికి బదిలీలు కోరుకునే వారు 50 ఏళ్లలోపు వారై ఉండాలని, గతంలో ఐటీడీఏ ప్రాంతంలో పనిచేసిన వారిని ఈ బదిలీలకు పరిగణనలోకి తీసుకోరాదని మార్గదర్శకాల్లో తెలిపారు.


ఉమ్మడి జిల్లాలు యూనిట్‌గా బదిలీల ప్రక్రియ

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సంబంధిత శాఖలు ఈ బదిలీలు చేపడతాయి. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ కేడర్‌ ఉద్యోగుల బదిలీలను ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా పరిగణించి చేపడతారు. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాకుండా సకాలంలో సంబంధిత శాఖలు బదిలీలు నిర్వహించాలని, అందుకు ఆయా శాఖల విభాగాధిపతులు బాధ్యత వహించాలని మార్గదర్శకాల్లో సూచించారు. గుర్తింపు పొందిన రాష్ట్ర, జిల్లా, డివిజన్‌/మండల స్థాయి ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు టర్మ్‌లు కానీ, తొమ్మిదేళ్లు సర్వీసు ఒకే చోట పూర్తి చేసి ఉంటేనే బదిలీ చేయాలని పేర్కొన్నారు. తాలూకా, జిల్లా స్థాయి గుర్తింపు పొందిన ఉద్యోగుల అసోషియేషన్‌ ఆఫీసు బేరర్స్‌ జాబితాను జిల్లా కలెక్టర్‌ ద్వారా ఆయా శాఖల హెచ్‌ఓడీలకు పంపాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల ఆఫీస్‌ బేరర్ల జాబితాను సాధారణ పరిపాలనశాఖ ద్వారా ఆయా హెచ్‌ఓడీలకు పంపించాలన్నారు. మార్గదర్శకాలకు విరుద్దంగా బదిలీలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జూన్‌ 3 నుంచి బదిలీలపై నిషేధం తిరిగి అమల్లోకి వస్తుందని ఆర్థికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2025 | 02:59 AM