Anagani Satya Prasad: తలుపు తట్టిన అదృష్టం
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:54 AM
ఆంధ్రజ్యోతి 22వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో నెల్లూరుకు చెందిన జొన్నాదుల కోటేశ్వరరావు స్విఫ్ట్ కారును గెలుచుకున్నారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విజేతను ఎంపిక చేసి అభినందించారు

‘ఆంధ్రజ్యోతి’ లక్కీ డ్రాలో నెల్లూరు వాసికి మారుతి స్విఫ్ట్ కారు
పాఠకుడికి ఫోన్లో అభినందనలు తెలిపిన మంత్రి సత్యప్రసాద్
18 ఏళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ మా ఇంటి సభ్యుడిగా మారిపోయింది
కార్ అండ్ బైక్ రేస్ విజేత జొన్నాదుల కోటేశ్వరరావు హర్షం
గుణదల/నెల్లూరు(స్టోన్హౌస్పేట), ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ కార్ అండ్ బైక్ రేస్ లక్కీ డ్రాలో నెల్లూరు వాసి విజేతగా నిలిచి, స్విఫ్ట్ కారును సొంతం చేసుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ 22వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన డ్రాలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కూపన్ల నుంచి మంత్రి ఒకదాన్ని డ్రా తీశారు. ఇందులో నెల్లూరుకు చెందిన ‘ఆంధ్రజ్యోతి’ పాఠకుడు జొన్నాదుల కోటేశ్వరరావు కారును గెలుచుకున్నారు. మంత్రి ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపి, కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం అనగాని మాట్లాడుతూ ‘అక్షరం మీ ఆయుధం’ నినాదంతో పాఠకులతో మమేకమవుతున్న ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యం 22 సంవత్సరాల నుంచి కార్ అండ్ బైక్ రేస్ పేరుతో పాఠకులకు పురస్కారాలు అందజేస్తోందని కొనియాడారు. ఇంతవరకు ఏ పత్రిక కూడా రూ.కోటి విలువైన బహుమతులను పాఠకులకు అందించలేదని చెప్పారు. ఎండీ వేమూరి రాధాకృష్ణ మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారనడానికి ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. ఇకపై తాను కూడా ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చే కూపన్లు నింపి పంపుతానని, డ్రాలో బహుమతి వస్తే పేదలకు అందజేస్తానని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ సర్క్యులేషన్ డైరెక ్టర్ రామకృష్ణారావు, విజయవాడ యూనిట్ మేనేజర్ వేమూరి మురళీ, ఏజీఎం పి.వాసు, అడ్వర్టైజ్మెంట్ ఏజీఎం టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంకా నమ్మలేకపోతున్నా
‘నేను రైల్వేశాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశాను. ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచీ ప్రతిరోజూ ‘ఆంధ్రజ్యోతి’ చదవడం నా హాబీ. గత 18 ఏళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ మా కుటుంబసభ్యుడిగా మారింది. లక్కీడిప్ కూపన్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూపన్లు పూర్తి చేసి పంపిస్తున్నాం. ఇన్నాళ్లకు ‘ఆంధ్రజ్యోతి’ మెగా డ్రాలో నాకు కారు వచ్చిందని ఫోన్ రావడం ఇంకా నమ్మలేకపోతున్నా. నాకు సైకిల్ తొక్కడం మాత్రమే వచ్చు. నా వయసు 79ఏళ్లు. ఇప్పటికీ సైకిల్ తొక్కుతాను. ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ వారు అందిస్తున్న కారులో నా కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ముందు సీట్లో కూర్చొని ‘ఆంధ్రజ్యోతి’ చదువుతూ ఆనందిస్తాను. ఒక పాఠకుడికి పత్రికా యాజమాన్యం ఈ తరహా పురస్కారం అందించడం గొప్ప విషయం. ఇది నా జన్మలో మర్చిపోలేను.’
- కార్ అండ్ బైక్ రేస్ విజేత జొన్నాదుల కోటేశ్వరరావు
Read Latest AP News And Telugu News