Inter student Case: ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:12 AM
Inter student Case: అనంతలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తన్మయిని ఎందుకు హత్య చేశాడనే విషయాన్ని నిందితుడు నరేష్ పోలీసులకు తెలిపాడు.

అనంతపురం, జూన్ 10: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోమన్నందుకే తన్మయిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు నరేష్ వెల్లడించాడు. నరేష్ ఇది వరకే మరో యువతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అనంతపూర్ జిల్లా (Anantapur District) రామకృష్ణనగర్లోని తన్మయి ఇంటి సమీపంలో నిర్మిస్తున్న ఓ కొత్త ఇంటికి టైల్స్ వేసేందుకు నిందితుడు వెళ్లాడు. ఆ విధంగా నరేష్, తన్మయి మధ్య పరిచయం, సాన్నిహిత్యం పెరిగింది. విద్యార్థిని తన తండ్రి సెల్ నుంచి పలుమార్లు నరేష్కు ఫోన్ చేసి మాట్లాడేది. అంతేకాకుండా ఫోన్ పే, నగదు రూపంలో డబ్బులు తీసుకున్నట్లు పోలీస్ విచారణలో నిందితుడు వెల్లడించాడు.
ఇదిలా ఉండగా.. తన్మయికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలంటూ నరేష్పై ఒత్తిడి తీసుకువచ్చింది విద్యార్థిని. అయితే తనకు ఇది వరకే పెళ్లి కావడంతో తన్మయిని అడ్డుతొలగించుకోవాలని అనుకున్నాడు నరేష్. పథకం ప్రకారమే తన్మియిని పిలిపించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తరువాత తాను అనుకున్న ప్రకారం తన్మయిని బండరాయితో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో బీర్ బాటిల్ను నోట్లో పెట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. తన్మయి హత్యకు సంబంధించి సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నరేష్ ఒక్కడే హత్య చేశాడా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
కాగా.. నగరంలోని స్థానిక రామకృష్ణానగర్కు చెందిన లక్ష్మీపతి కుమార్తె తన్మయి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వివేకానంద కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని.. ఈనెల 3నుంచి కనిపించకుండా పోయింది. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈనెల 7న కూడేరు మండలం గొట్కూరు సమీపంలో అనంతపురం - బళ్లారి ప్రధాన రహదారి పక్కన గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తన్మయి తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకుని మృతదేహం తమ కుమార్తెదే అని గుర్తించి బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం తన్మయి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కుమార్తెను హత్య చేసిన వారిని శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మరోవైపు తన్మయి మృతి పట్ల మంత్రులు కూడా తీవ్రంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ బుద్ధి మారటం లేదు..
నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..
Read latest AP News And Telugu News