Girls Safety: అమ్మాయిలు బయట జాగ్రత్తగా ఉండండి.. రాయపాటి శైలజ సూచన
ABN , Publish Date - Jun 12 , 2025 | 11:21 AM
Girls Safety: అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని, కాలం బాగోలేదని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన రెండు ఘటనలపై శైలజ స్పందించారు.

అనంతపురం, జూన్ 12: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ (AP Womens Commission Chairperson Rayapati Sailaja) స్పందించారు. జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలని... ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకోవాలని అన్నారు. కాలం బాగోలేదని... బయట జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సత్యసాయి జిల్లాలో మైనర్పై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడ్డారన్నారు. ఈ దారుణ ఘటనలో నిందితులను పట్టుకున్నామని.. మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రామగిరి దళిత మైనర్ బాలిక ఘటనలో పార్టీలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే తన్మయి కేసులో మొదట బాలు అనే యువకుడిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారని.. అందుకే బాలుపై పోలీసులు దృష్టి పెట్టారని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.
రెండేళ్లుగా లైంగిక దాడి
సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దళిత బాలికపై రెండేళ్లుగా కొంతమంది అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై కొందరు రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారు. దీనిని బాలిక తల్లిదండ్రులు పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకురాగా.. బాలికకు న్యాయం చేయాల్సిన ఆ పెద్దలు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. అంతే కాకుండా బాలికకు రెండు సార్లు అబార్షన్లు కూడా చేయించారు. ఇంతటితో ఆగకుండా బాలిక కుటుంబాన్ని కొండగుట్టల్లో దాచారు. ఎట్టకేలకు మైనర్కు జరిగిన అన్యాయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని దారుణ హత్య
మరోవైపు అనంతపురం జిల్లాలో తన్మయి అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని హత్య ఉదంతం కూడా సంచలనం సృష్టించింది. తన్మయి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉరవకొండ ప్రధాన రహదారిలో కూడేరు వద్ద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తన్మయి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆ మృతదేహం తమ కుమార్తెదే అని గుర్తించిన పేరెంట్స్ బోరున విలపించారు. అయితే తన్మయిని నరేష్ అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం వల్లే తన్మయి తలపై బీర్ బాటిల్తో కొట్టి నరేష్ హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. అయితే మందు బాబులకు అడ్డాగా మారిన ముళ్లపొదల్లో తన్మయి డెబ్ బాడీ ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరేష్తో పాటు మరికొంత మంది కలిసి తన్మయిని హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఈ రెండు ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. ఈ రెండు కేసుల్లో నిందితులను వదలొద్దని, కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
హనీమూన్ హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్.. సోనమ్ లవర్ రాజ్ కాదా..
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తిపై సీఎం చంద్రబాబు ట్వీట్
Read latest AP News And Telugu News