Share News

Deputy Speaker: సజ్జల వ్యాఖ్యలపై రఘురామ ఫైర్‌

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:31 AM

అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.

Deputy Speaker: సజ్జల వ్యాఖ్యలపై రఘురామ ఫైర్‌

  • సంకరజాతి అంటూ దూషించిన ఆయనపై చర్యలు ఉంటాయి

  • ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌

కాళ్ల, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రజలను ఉద్దేశించి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అమరావతిలో మహిళలను వేశ్యలుగా వర్ణిస్తూ జగన్‌ మీడియాలో మాట్లాడిన జర్నలిస్టు కృష్ణంరాజు, యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక మహిళలు వారి ఫొటోలను చెప్పులతో కొట్టారు. దానిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడటం హాస్యాస్పదం. ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలని రాక్షసులు, పిశాచులు, సంకర జాతి అంటూ మాట్లాడటం దారుణం. అమరావతి ప్రాంతంలో కేవలం ఒక కులం వారే జీవించడం లేదు. అక్కడ ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ... తదితర అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు జీవిస్తున్నారు. అమరావతిలో నివాసం ఉంటున్న వారిని సంకరజాతి అనడం క్షమించరాని పదం. సమాజాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేశా. ఆ మీడియా సంస్థను నడుపుతున్న వ్యక్తి కూడా మహిళే. ఆమె కూడా ఇటువంటి వ్యాఖ్యలను ఖండించకపోగా అరెస్టును నిరసించడం సమంజసం కాదు’ అని రఘురామ అన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 05:32 AM