Share News

PSR Anjaneyulu Custody: అధికారముంది.. చేశానంతే

ABN , Publish Date - May 27 , 2025 | 03:56 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు మాట్లాడుతూ, తాను కమిషన్‌ నిర్ణయాలే అమలు చేశానని చెప్పారు. కామ్‌సైన్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ ఇవ్వడంలో తన అధికారాన్ని వినియోగించానని వెల్లడించారు.

 PSR Anjaneyulu Custody: అధికారముంది.. చేశానంతే

  • కమిషన్‌ నిర్ణయాలే అమలు చేశాను

  • కస్టడీలో పీఎస్ఆర్‌ సమాధానాలు

  • కొన్నింటికి మౌనం, తెలియదని జవాబు

  • రెండో రోజు 32 ప్రశ్నలు

  • కాసేపు పోలీసు కమిషనర్‌ విచారణ

  • ఏపీపీఎస్సీ గ్రూపు-1 కేసులో ముగిసిన పీఎ్‌సఆర్‌, మధుసూదన్‌ కస్టడీ

విజయవాడ, మే 26(ఆంధ్రజ్యోతి): ‘‘నిర్ణయాలను అమలు చేసే అధికారం నాకు ఉంది. అదే చేశాను. నేను సొంతంగా ఏ నిర్ణయాన్నీ అమలు చేయలేదు. కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలను అమలు చేశాను. అంతకుమించి నేను చేసిందేమీ లేదు’’.. ఏపీపీఎస్సీ గ్రూపు-1 కేసులో ఐపీఎస్‌ అధికారి పీఎస్ఆర్‌ ఆంజనేయులు కస్టడీలో దర్యాప్తు అధికారులకు చెప్పిన సమాధానాలు ఇవి. చాలా ప్రశ్నలకు ‘అధికారం ఉంది కాబట్టి చేశాను. అంతే... ఇందులో పెద్దగా చెప్పదగిందేమీ లేదు’ అని చెప్పారు. పీఎ్‌సఆర్‌తో పాటు పమిడికాల్వ మధుసూదన్‌ను సోమవారం పోలీసులు విజయవాడ సూర్యరావుపేట పోలీస్ స్టేషన్‌లో విచారించారు. దర్యాప్తు అధికారి నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్‌ వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. రెండో రోజున పీఎ్‌సఆర్‌కు 32 ప్రశ్నలు, మధుసూదన్‌ను 14 ప్రశ్నలు వేశారు. ఎవరి సిఫార్సుతో కామ్‌సైన్‌ సంస్థకు డిజిటల్‌ మూల్యాంకనం కాంట్రాక్ట్‌ ఇచ్చారని ప్రశ్నించారు. తన అధికారాలను ఉపయోగించుకుని ఈ కాంట్రాక్ట్‌ ఇచ్చానని పీఎ్‌సఆర్‌ చెప్పినట్టు తెలిసింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి హోదాలో అమలు చేశానని సమాధానం చెప్పారు. కామ్‌సైన్‌ సంస్థకు రూ.1.14 కోట్లను ఎలా చెల్లించారని ప్రశ్నించగా.. అధికారం ఉంది కాబట్టి చెల్లించానని తెలిపారు. తాను కార్యదర్శిగా గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించానని అంగీకరించారు. హాయ్‌ల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, వెల్డింగ్‌ పనులు చేసే వారితో పరీక్షాపత్రాలను దిద్దించి ప్రొఫెసర్ల మాదిరిగా ఎందుకు సంతకాలు చేయించారని ప్రశ్నించగా... అది తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కాంట్రాక్ట్‌ ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలకు ఆ సంస్థే బాధ్యత వహిస్తుందని వివరించినట్టు సమాచారం. డిజిటల్‌ మూల్యాంకనంపై వివాదం రేగిన తర్వాత కామ్‌సైన్‌ నుంచి ఆ డబ్బులను ఎందుకు వెనక్కి తీసుకోలేదని అధికారులు అడిగారు.


తాను కొద్దినెలలు మాత్రమే కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరించానని, ఆ తర్వాత అక్కడ లేనని పీఎ్‌సఆర్‌ చెప్పినట్టు సమాచారం. కమిషన్‌ నిర్ణయాలను అమలు చేసినప్పుడు దానికి సంబంధించిన తీర్మానాల కాపీని చూపించాలని దర్యాప్తు అధికారి తిలక్‌ అడిగారు. ఆ కాగితాలన్నీ ఏపీపీఎస్సీలో ఉంటాయని పీఎస్ఆర్‌ సమాధానం చెప్పారు. డిజిటల్‌ మూల్యాంకనం జరిగినప్పుడు, కామ్‌సైన్‌ సంస్థకు డబ్బులు చెల్లించినప్పుడు కార్యదర్శి హోదాలో ఉన్నారని ఆధారాలను చూపించగా.. వాటిని చూసిన పీఎ్‌సఆర్‌ సమాధానం చెప్పలేదు. విచారణ అనంతరం పీఎస్ఆర్‌ మధుసూదన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత ఇన్‌చార్జి కోర్టు అయిన రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని న్యాయాధికారి అప్పారావు అడిగారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదని వారు చెప్పారు. అనంతరం జిల్లా జైల్లో నిందితులను అప్పగించారు.

పీఎస్ఆర్‌ను విచారించిన సీపీ

సూర్యరావుపేట పోలీస్ స్టేషన్‌లో పీఎస్ఆర్‌ ఆంజనేయులును విజయవాడ పోలీసు కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌బాబు కొద్దిసేపు విచారించారు. సోమవారం ఉదయం కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆయన నేరుగా సూర్యరావుపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే పీఎ్‌సఆర్‌ను నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్‌ విచారిస్తున్నారు. ఈలోగా పోలీసు కమిషనర్‌ వెళ్లారు.పీఎస్ఆర్‌ను నాలుగైదు ప్రశ్నలు సంధించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - May 27 , 2025 | 03:57 AM