Share News

AP High Court: అక్రమమైనింగ్‌ కేసులో వంశీకి బెయిల్‌

ABN , Publish Date - May 30 , 2025 | 03:48 AM

ఉమ్మడి కృష్ణా జిల్లా అక్రమ మైనింగ్‌ కేసులో వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో విచారణ వాయిదా పడగా, ఆయుష్‌ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతి ఇచ్చారు.

AP High Court: అక్రమమైనింగ్‌ కేసులో వంశీకి బెయిల్‌

  • పలు షరతులతో హైకోర్టు మంజూరు

  • నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా

  • ఆయుష్‌ ఆస్పత్రిలో వైద్యానికి అనుమతి

  • వంశీ రిమాండ్‌ పొడిగించిన నూజివీడు కోర్టు

అమరావతి/నూజివీడు టౌన్‌, మే 29(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది. గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోకు రూ. 20 వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీట్‌ దాఖలు చేసేవరకు ప్రతీ రెండో శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా వంశీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత దురుద్దేశపూర్వకంగా కేసు పెట్టారని చెప్పారు. పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుత కేసులో పీటీ వారెంట్‌ అమలు చేయబోమని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. కౌంటర్‌ వేసేందుకు వారం రోజులు ఇవ్వాలని కోరారు.


5న వైద్య నివేదిక ఇవ్వాలి: హైకోర్టు

నకిలీ ఇళ్ల పట్టాల జారీకి సంబంధించి నమోదైన కేసులో వంశీ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. వంశీని ఆయుష్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించాలని విజయవాడ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది. వైద్య పరీక్షల సమయంలో ఆయన సతీమణి లేదా ఆమె సూచించిన కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే అనుమతించాలంది. వైద్య పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందజేయాలని స్పష్టం చేసింది. ఆ నివేదికను జూన్‌ 5న కోర్టు ముందు ఉంచాలంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ మంజూరు పిటిషన్‌ గురువారం విచారణకు వచ్చింది. వంశీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.శ్రీరామ్‌, పోలీసుల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కాగా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీ రిమాండ్‌ను మరో 14 రోజులు పొడిగిస్తూ నూజివీడు సెకండ్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - May 30 , 2025 | 03:49 AM