Tirumala Police Misconduct: తిరుమలలో మద్యం మత్తులో ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల వీరంగం
ABN , Publish Date - May 24 , 2025 | 04:05 AM
తిరుమలలో మద్యం మత్తులో కర్నూలు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు అవినీతి ప్రదర్శించారు. వీరిపై సస్పెన్షన్ జారీ చేసి, వారి ఇన్చార్జికి చార్జిమో కూడా జారీ చేశారు.

తిరుమల/కర్నూలు క్రైం, మే 23(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే తప్పతాగి స్థానికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఓంకార్ నాయక్, కానిస్టేబుళ్లు రాజశేఖర్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలలో విధులు నిర్వహించేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఎపీఎస్పీ విభాగానికి చెందిన ఓ అధికారి వాహనం తీసుకుని తిరుపతికి వెళ్లారు. మద్యం తాగి.. అలిపిరి భదత్రా తనిఖీలను దాటి మరీ సాయంత్రం తిరుమల చేరుకున్నారు. డీ టైప్ క్వార్టర్స్ వద్దనున్న సచివాలయం వద్ద డివైడర్ను ఢీకొనడంతో జీపు ముందు టైర్ పగిలిపోయింది. దీంతో వారు వాహనం దిగి నానా హంగామా చేశారు. నేలపై పడి దొర్లుతూ.. రోడ్డు పక్కనే మూత్ర విసర్జన చేసి హల్చల్ చేశారు. ఈ విషయం తెలిసి విజిలెన్స్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోగా షేక్ సిరాజ్జుద్దిన్ పారిపోగా, రాజశేఖర్, ఓంకార్ నాయక్ను అదుపులోకి తీసుకున్నారు.
కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
మద్యం తాగి తిరుమలలో వీరంగం చేసిన కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ కమాండెంట్ దీపికా పాటిల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వీరి ఇన్చార్జి ఆర్ఎ్సఐకి కూడా చార్జిమెమో జారీ చేసినట్టు వెల్లడించారు.