Heart Attack: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:22 AM
ఆదివారం కదా అని సరదాగా క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడు గ్రౌండ్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో జరిగింది.

మేడ్చల్ జిల్లా కీసరలో ఘటన
కీసరరూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఆదివారం కదా అని సరదాగా క్రికెట్ ఆడేందుకు వచ్చిన ఓ యువకుడు గ్రౌండ్లోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కీసరలో జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన ప్రణీత్ (32) ఆదివారం కార్యాలయానికి సెలవు కావడంతో క్రికెట్ ఆడేందుకు తన మిత్రులతో కలిసి నాగారం మునిసిపాలిటీ రాంపల్లి దాయరలోని త్యాగి క్రికెట్ గ్రౌండ్కు వచ్చాడు.
ఆట మధ్యలో ప్రణీత్ ఒక్కసారిగా తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన మిత్రులు అతణ్ని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రణీత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రణీత్ అవివాహితుడు.