Jagityal: వీడియో కాల్ సాయంతో ఆపరేషన్?
ABN , Publish Date - Jun 13 , 2025 | 04:07 AM
కడుపులో కణితులు తొలగించుకోవడానికి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఆపరేషన్ చేస్తుండగా చనిపోయింది. అయితే, సర్జరీ చేస్తున్న డాక్టర్ మరో డాక్టర్తో వీడియో కాల్లో సాయం తీసుకుంటూ వైద్యం చేయడం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

జగిత్యాల ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి
డాక్టర్ నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆందోళన
జగిత్యాల అర్బన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): కడుపులో కణితులు తొలగించుకోవడానికి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఆపరేషన్ చేస్తుండగా చనిపోయింది. అయితే, సర్జరీ చేస్తున్న డాక్టర్ మరో డాక్టర్తో వీడియో కాల్లో సాయం తీసుకుంటూ వైద్యం చేయడం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత రాజవ్వ(42) గర్భసంచిలో కణితులు వచ్చి ఇబ్బంది పడుతోంది. వాటిని తొలగించుకోవడానికి బుధవారం జగిత్యాలలోని పల్లవి ఆస్పత్రిలో చేరింది.
అయితే, ఆపరేషన్ చేస్తుండగా గుండె పోటు వచ్చి గురువారం ఉదయం ఆమె మృతి చెందిందని వైద్యురాలు రాజవ్వ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించారు. హైదరాబాద్లోని వైద్యులతో ఫోన్లో వీడియోకాల్ చేస్తూ ఆపరేషన్ చేయడం వల్లనే రాజవ్వ చనిపోయిందని ఆరోపించారు. పోలీసులు వచ్చి మృతురాలి బంధువులను సముదాయించారు. జగిత్యాలకు చెందిన వైద్యులు వారితో మంతనాలు జరిపి శాంతింపజేశారు. దీనిపై పల్లవి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ పద్మినిని వివరణ కోరగా రాజవ్వకు గర్భసంచిలో కణితి పెద్దగా ఉందని, ఆమెకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ చేయడానికి సిద్ధమవుతుండగా గుండె పోటు వచ్చి మృతి చెందిందని తెలిపారు. ఇతర వైద్యులను కూడా పిలిపించి ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయామని చెప్పారు.