Bhatti Vikramarka: సీఏలు ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములు
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:50 AM
చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములు కావాలని, చిన్న వ్యాపారాల ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు.

చిన్న వ్యాపారాల అభివృద్ధికి దోహదపడాలి: భట్టి
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): చార్టెర్డ్ అకౌంటెంట్లు(సీఏలు) ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలో భాగస్వాములు కావాలని, చిన్న వ్యాపారాల ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సూచించారు. నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో గురువారం శిల్ప కళా వేదికలో జరిగిన సీఏ విద్యార్థుల జాతీయ స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీఏలు తమ ప్రతిభను సంపాదనకే కాకుండా సేవకు వినియోగించాలని, సామాజిక తనిఖీలు చేయాలని అన్నారు.
సీఏ విద్యార్థులు భవిష్యత్తులో సొంత సంస్థలు స్థాపించే అవకాశాలుంటాయని, ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగ దాతలుగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతుందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులు చేపడుతుండడంతో పాటు అనేక పరిశ్రమలకు కేంద్రంగా ఉందని తెలిపారు.