Vemulawada temple: ఆలయ గోశాలలు జాగ్రత్త!
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:36 AM
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మూగ రోదన నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నిర్వహిస్తున్న గోశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.

జీవాల ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి
ఈవోలకు దేవాదాయ శాఖ ఆదేశం
రాష్ట్రంలో 69 ఆలయాల్లో గోశాలలు
200 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహణ
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మూగ రోదన నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో నిర్వహిస్తున్న గోశాలలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఆలయాల్లో ఉన్న గోశాలల నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయాల ఈవోలను ఆదేశించారు. జీవాల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతోపాటు అవసరమైన చికిత్స అందించాలని నిర్దేశించారు. గోగ్రాసం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, జీవాలు ఎక్కడైనా అనారోగ్యం బారిన పడితే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుల్ని సంప్రదించాల్సిందిగా ఈవోలకు ఆదేశాలు జారీ చేశామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 69 ఆలయాల్లో గోశాలలు నిర్వహిస్తున్నారు. అన్ని ఆలయాల్లో కలిపి సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో గోశాలలు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆలయ గోశాలల్లో మొత్తం 3,009 జీవాలు ఉండగా.. వాటిలో 1089 ఆవులు, 1526 కోడెలు, 394 దూడలు ఉన్నాయి.
మొత్తం జీవాల్లో సగానికి పైగా వేములవాడ రాజన్న ఆలయంలోనే ఉండడం గమనార్హం. ఈ గోశాలలో 1230 కోడెలు, 44 ఆవులు, 8 దూడలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఆలయాల్లో 25 గోశాలలు నిర్వహిస్తున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో కాకుండా ప్రైవేటు ట్రస్టులు నిర్వహిస్తున్న గోశాలల్లో 23,468 ఆవులు, కోడెలు, దూడలు ఉన్నాయి. కాగా, ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాల నిమిత్తం పరిమిత సంఖ్యలో ఆవులు, దూడలను గోశాలలో ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్క వేములవాడలోనే వందల సంఖ్యలో ఆవులు, దూడలు ఉంటాయని వాటి నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ తీవ్ర అనారోగ్యం కారణంగా మృతి చెందుతున్నాయని తెలిపారు. పరిమితికి మించి భక్తులు సమర్పిస్తున్న కోడెల్ని నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ అవసరాలకు రైతులకు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతి ఘటనపై గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వేములవాడ గోశాలలో జీవాల రక్షణకు చేపట్టాల్సిన మెరుగైన చర్యలపై చర్చించి దేవాదాయ శాఖకు తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి